మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 4: నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచించాలని, అందుకు అధికారులు సహకారం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సుకు కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగునీరు అందుబాటులో ఉన్నందునా, రైతులు వరి, కూరగాయలు ఇతర లాభాల పంటలు వేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూరగాయలు మంచిర్యాలకు దిగుమతి అవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కూరగాయలు పండిస్తే లాభసాటిగా ఉంటుందని తెలిపారు. అలాగే పాడి పరిశ్రమ వృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా కలెక్టర్ తోపాటు వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్, ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. సదస్సులో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈకార్యక్రమంలో లీడ్ బాంక్ రీజినల్ మేనేజర్ అపర్ణా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, బీజేపీ సీనియర్ నాయకుడు గొనె శ్యామ్ సుందర్ రావు, నాయకులు బొడ్డు శంకర్, రైతులు పాల్గొన్నారు.