రైతుల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నకిలీ విత్తనాల నివారణపై ఉక్కుపాదం మోపింది. దుకాణాలతోపాటు దళారులు నకిలీ విత్తనాలు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నకిలీ విత్తనాల నివారణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
– ఆదిలాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ః ఆదిలాబాద్ జిల్లాలో రైతులు అధికంగా పత్తి వేస్తారు. సాగులో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 రకం విత్తనాలను వినియోగిస్తున్నారు. ఈ సీజన్లో 3.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని కొందరు దళారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తారు. మారుమూల పల్లెలు, ఏజెన్సీ గ్రామాల్లో కూడా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతాయి. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. వీళ్లు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. అమ్మకాల్లో నిబంధనలు పాటించాలని, వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు రసీదులు అందజేయాలని సూచించారు. అధికారులు నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపడంతో వీటి విక్రయాలు జరగడం లేదు. జిల్లాలో మూడేళ్లుగా టాస్క్ఫోర్స్ బృందాల తనిఖీల కారణంగా రైతులకు మేలు రకమైన విత్తనాలు లభిస్తున్నాయి.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు..
పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి, ఆదిలాబాద్ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై డీలర్లు, కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. విత్తనాల నిల్వలు, సరఫరా, అమ్మకం, ఆన్లైన్లో వివరాల నమోదు విషయాలను వారికి తెలియజేశాం. వానకాలం సీజన్ ప్రారంభంకానుండడంతో నకిలీ విత్తనాలు నివారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. జిల్లా, మండల, గ్రా మ స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. పంట విక్రయాలు జరిగేంత వరకు వాటిని భద్రపర్చుకోవాలి. బ్యాగుల సీల్, కంపెనీ ముద్ర, ప్యాకింగ్ తేదీ, ఎక్స్పైరీ తేదీ, ఎమ్మార్పీ చూడాలి. విత్తనాల కారణంగా దిగుబడులు రాకపోతే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే అవకాశాలున్నాయి.