ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండగా.. వృద్ధులు, మహిళలు, యువత కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారు. అభ్యర్థులు కూడా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, ధరణి పథకాల ప్రయోజనాల గురించి తెలుపుతున్నారు. నిర్మల్లోని పలు వార్డుల్లో శుక్రవారం అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ మండలంలో జోగు రామన్న, ఉట్నూర్ పట్టణం, సిరికొండ మండలం ఫకీరానాయక్ తండాలో జాన్సన్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ముథోల్లో విఠల్రెడ్డి, బోథ్లో అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
– ఆదిలాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. శుక్రవారం ప్రచార హోరు కొనసాగించారు. నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ పట్టణంలోని బాలాజీవాడ, రథాల గుడి, బ్రహ్మపురి, షేక్ సాహెబ్పేట్, ద్వాగవాడతోపాటు పలు మసీదులను సందర్శించారు. పట్టణవాసులు ఘనంగా స్వాగతం పలికారు. వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సుమారు 25 మందికి పైగా యువకులు బీజేపీ నుంచి గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ సమక్షంలో దస్తురాబాద్ మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఎంబడి గోవర్ధన్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సురేశ్లతోపాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ యూత్, ఎన్ఎస్యూఐ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జాన్సన్ నాయక్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బేల మండలంలో అవాల్పూర్, సిర్సన్న, బాది, హెట్టి గ్రామాల్లో క్యాంపెయిన్ చేశారు. మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో ఆదిలాబాద్ కేఆర్కే కాలనీకి చెందిన 150 మంది యువత బీఆర్ఎస్లో చేరారు. బోథ్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్జాదవ్, మాజీ ఎంపీ నగేశ్తో కలిసి ఇచ్చోడలో సీఎం ప్రచార సభా స్థలాన్ని పరిశీలించారు. ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఉట్నూర్ మండలం కొలాంగూడ, హీరాపూర్లో దండారీ వేడుకల్లో పాల్గొన్నారు. ఉట్నూర్ పట్టణం, సిరికొండ మండలం ఫకిరానాయక్ తండాలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు వచ్చిన వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.