మిగ్జాం సైక్లోన్.. రైతన్నలను ఆగమాగం చేస్తున్నది. కోతకొచ్చిన వరి పైరు నేలమట్టమైంది.. కల్లాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. పత్తి రాలడంతోపాటు నల్లబారుతోంది. ఈదురుగాలులకు కంది, మిర్చి గింజలు రాలిపోతున్నాయి. పత్తిని ఏరడానికి కూలీలు దొరుకక పోవడంతో రైతన్నలు చాలా అవస్థలు పడుతున్నారు. అధిక కూలి ఇచ్చినా ఏరడానికి ముందుకు రావడం లేదని వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట కండ్ల ముందే పాడవుతుంటే ఏం చేయలేని నిస్సాహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పత్తి 10.09 లక్షల ఎకరాలు, వరి 3.29 లక్షల ఎకరాలు, మరో మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల్లో పప్పు దినుసులు, సోయా, జొన్నలు, ఇతర పంటలు సాగయ్యాయి. ఈ పంటలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దిగుబడులు తగ్గుతాయని, గిట్టుబాటు ధరరాదని రైతన్నలు దిగాలు చెందుతున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల బుధవారం అర్ధరాత్రి భారీ వర్షాలు, ఈదురు గాలులొస్తే రైతన్నలకు కోలుకోలేని దెబ్బ తగులుతోందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– మంచిర్యాల, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిగ్జాం తుఫాన్ ప్రభావంతో రైతులు ఆగం అవుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, ఈదురుగాలులు వీస్తుండడతో జనం వణికిపోతున్నారు. ఇలాంటి వాతావరణంతో పత్తిపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. సేకరణ దశకు వచ్చిన పత్తి వర్షాలకు తడిసి చేలలోనే రాలిపోతున్నది.
పైగా తడిసిన పత్తి రంగు మారుతోంది. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఏరిద్దామంటే వర్షాలకు, చల్లని వాతావరణానికి కూలీలు దొరకడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని పంట కండ్ల ముందే పాడవుతుంటే ఏం చేయలేని రైతన్నలు నిస్సాహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని చోట్ల వరి కోయగా.. మరికొన్ని చోట్ల ధాన్యాన్ని కల్లాలకు తరలించారు. చిరుజల్లులతో వరి పైరును, ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు తండ్లాడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు కప్పుతున్నారు. రేపో, మాపో వరి కోతలు చేద్దామనుకున్న రైతులు చేతికి అందివచ్చిన వర్షాలకు నేలకొరుగుతుంటే చూసి లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలు చేతికొచ్చే సమయంలోనే తమను ఆగం చేస్తున్నాయని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన పత్తిని, ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్న రైతుల దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ఈదురుగాలులు, చిరుజల్లులతో పెద్దగా పంట నష్టం ఏం లేదని అధికారులు చెప్తున్నా.. చేతికొచ్చిన పత్తి, వరికి మాత్రం కోలుకోలేని దెబ్బ అని రైతులు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి దాదాపు 10.09 లక్షల ఎకరాల్లో పత్తి, 3.29 లక్షల ఎకరాల్లో వరి, మరో మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల్లో పప్పు దినుసుల, సోయా, జొన్నలు, ఇతర పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగు చేయగా.. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరి సాగు వేశారు.
అకాల వర్షాలకు దాదాపుగా 13 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం పడతోందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ నష్టం కాకపోయిన దిగుబడులు తగ్గి, పత్తి రంగు మారి, ధాన్యం తడిసి తక్కువ ధరకు పంటలు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. తుఫాన్ ప్రభావం ఇప్పుడే మొదలైందని బుధవారం అర్ధరాత్రి భారీ వర్షాలు, ఈదురు గాలులు వస్తే మాత్రం రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుంటాల, డిసెంబర్ 6 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు కోసిన ధాన్యాన్ని ఆరబోశారు. మిగ్జాం తుఫాను ప్రభావం వల్ల చినుకులు కురుస్తుండడంతో ధాన్యం తడుస్తోంది. తడిసి వడ్ల గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుతున్నారు.
వాంకిడి/కెరమెరి,డిసెంబర్ 6: మిజాంగ్ తుఫాన్ కారణంగా వర్షం, ఈదురు గాలులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజులుగా చిరు జల్లులు పడుతుండగా, వాతావరణం చల్లబడింది. మిర్చి, పత్తి పంట నేలరాలుతున్నది. పత్తి తడిసి పోయి రైతుకు నష్టం వాటిల్లుతున్న ది. కెరమెరి మండలంలో కంది పంట సైతం ఏపుగా పెరిగి పూతపూసి కాయలు కాస్తున్న నేపథ్యంలో ఈదురు గాలులతో నేల కొరిగాయి. అకాల వర్షంతో అన్నదాతలు పరేషాన్ లో పడ్డారు.
పెంచికల్పేట్, డిసెంబర్ 6 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండల వ్యాప్తంగా పత్తి ఏరుతుండగా.. వరి పంటను కూడా కొస్తున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టడానికి తీసుకెళ్తున్నారు. తడవకుండా కవర్లు కప్పుతున్నారు. పత్తిని ఏరడానికి కూలీలు దొరకక పోవడంతో తడిసి నల్లబారుతున్నాదని, మిరప తోటలో కాయలు కూడా రాలిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
తాంసి(తలమడుగు), డిసెంబర్ 6 : తాంసి, తలమడుగు మండలాల వ్యాప్తంగా ముసురు పడుతున్నది. తేలికపాటి వానకు తోడు ఆకాశమంతా మేఘావృతమై చల్లటి గాలులు వీచాయి. పత్తి, కంది పంటలకు నష్టం కలుగుతుందని రైతులు భయపడుతున్నారు.
దస్తురాబాద్, డిసెంబర్ 6 : మిగ్జాం తుఫాను ప్రభావం వల్ల పంటలు నేలకొరుగుతున్నాయి. ధాన్యం తడిసి ముద్దవుతున్నది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. ధాన్యంపై కప్పిన కవర్లపై వర్షపు నీరు నిలిచింది. ధాన్యం బస్తాలు తడిశాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు చర్యలు
తీసుకొని.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.