తానూర్, మే 7 : కేసీఆర్ గర్జన వల్లే రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయని, కార్యకర్తలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయ న పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదని, బీఆర్ఎస్కే ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ.. నేడు కరువు కాటకాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆ పార్టీలో సభ్యత్వం లేని నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వడం వారి దురావస్థకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి, నాయకులు లోలం శ్యాం సుందర్, విలాస్ గాదేవార్, కిరణ్ కుమ్రేవార్, నసీర్ బేగ్, విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ స్వామి, గజానంద్ పటేల్, శివదాస్ పటేల్, మొగిలి, ఎంపీటీసీ లక్ష్మణ్ పాల్గొన్నారు.