monsoon rain : ఇండియాలో వానలకు మూలమైన నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పట్లో బలహీనపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో ఆగష్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంతకాలం సరైన వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు తాజా వానలు ఉపశమనం కల్పిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వానల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
దీంతో వర్షపాత లోటు కూడా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో వర్షపాతం లోటు 14 శాతానికి మాత్రమే చేరుకుంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో మేఘాలు భారీ స్థాయిలో వ్యాపించి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆగష్టు మొదటి సగం మాత్రం భారీ వానలు తప్పవని చెబుతున్నారు. సెంట్రల్ ఇండియా, పశ్చిమ భారతంలోనూ వానలు పడుతాయి. ఇప్పటికే మహారాష్ట్రతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఇవి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయి. రాజస్థాన్, గుజరాత్లకు కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు చోటుండటం, రిజర్వాయర్లు నిండుతుండటం, నదులు జలకళ సంతరించుకోవడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఐఎండీ నిపుణులు అంచనావేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై సహా అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా గత వారం నుంచి వర్షాలు జోరందుకున్నాయి.