Mallikarjun Kharge : ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ (Exam Papers Leakage) లను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత (Opposition Leader) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.
ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగిందని ఖర్గే ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తాయని గుర్తుచేశారు. ఆ శాఖ అనుమతి లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం లేదని అన్నారు. ఈ ఘటనపై అమిత్ షా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే బిల్లును ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని ఖర్గే ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే సంస్కరణలు చేయకుండా ప్రభుత్వం రాజకీయాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలను చల్లార్చేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీ రాజకీయాల వల్లే దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరసనలు, పోలీసు చర్యలు చోటుచేసుకున్నాయని అన్నారు. పేపర్ లీకేజీలు జరిగిన తర్వాత నష్టనివారణ చర్యలు తీసుకోవడం ఒక్కటే సరిపోదని ఖర్గే అభిప్రాయపడ్డారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరించబోయే స్పష్టమైన కార్యాచరణను వివరించలేదని విమర్శించారు. ఈ బిల్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా అన్న సందేహాన్ని వ్యక్తంచేశారు. గత రెండు నెలలుగా విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థపై నిరసనలు వ్యక్తంచేశారని ఖర్గే గుర్తుచేశారు. వారి గొంతుకను ప్రతిపక్షం వీధుల నుంచి పార్లమెంట్ వరకు వినిపించిందన్నారు. ప్రజల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పోరాటం ఫలించిందని, వారి ఉద్యమంవల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.