కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ సిర్పూర్(యు), ఏప్రిల్ 5 : సిర్పూర్(యు) మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ వాసులు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం రాళ్లురప్పలతో కూడిన అడవి దారి గుండా వెళ్లి.. గుట్ట కింద ఉన్న పాడుబడ్డ బావిలో నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 ఇండ్లు ఉన్న ఈ గ్రామంలో అంతా ఆదివాసులే.
వీరి నీటి గోసను తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా పైపులైన్ను వేసింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు కాలేదు. గతంలో గ్రామం వరకు ఉన్న పైపులైన్ ద్వారా వచ్చిన నీటిని గ్రామస్తులంతా పట్టుకొనేవారు. పైపులైన్లు పగిలిపోవడంతో నాలుగు నెలలుగా నీరందడం లేదు.
దీంతో దశాబ్దాల క్రితం గుట్ట కింద తవ్వుకున్న బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. గుట్ట దిగిన తర్వాత అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ బావి వద్దకు ఇంటిల్లిపాది వెళ్లాల్సి వస్తున్నది. ఎడ్ల బండి ఉన్నవారు చిన్న ట్యాంకు ఏర్పాటు చేసుకొని నీళ్లు తెచ్చుకుంటారు. ఇక మిగతా వారందరికీ కాలినడకే. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో మరోసారి నెత్తి మీద మోత తప్పడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు.
నాలుగు నెలల కిందటి వరకు మిషన్ భగీరథ పైపులైన్ ద్వా రా మా గ్రామానికి నీళ్లచ్చేవి. ఇంటింటి కీ నల్లాలు పెట్టలేదు. నీళ్లు మాత్రం మా గ్రామం వర కు వచ్చాయి. ఇప్పుడు నీళ్లు వస్తలేవు. దీంతో గుట్ట కింద పదేళ్ల క్రితం తవ్వుకున్న బావే మళ్లీ దిక్కైంది. ఇప్పుడది పాడుబడింది. అయినా ఆ నీరే తెచ్చుకుంటున్నం. అధికారులు మా తాగునీటి సమస్యను అర్థం చేసుకొని పైపులైన్ ద్వారా నీళ్లందించాలి.
-మడావి ఆనంద్ రావు, పూనగూడ
బిందె నీళ్ల కోసం గుట్ట దిగాల్సి వస్తున్నది. పదేళ్ల కింద గుట్ట కింద తవ్వుకున్న బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నం. నీళ్ల బిందె నెత్తిమీద ఎత్తుకొని గుట్ట ఎక్కాలంటే నరకంలా ఉంది. తాగే నీటి కోసం మస్తు ఇబ్బంది అయితున్నది. ఇన్నాళ్లూ మాకు పైపులైన్తోనే నీళ్లచ్చేవి. ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఏమైందో కానీ నీళ్లస్తలేవు. మా గోసను ప్రభుత్వం పట్టించుకోవాలె.
-మడవి ఇంద్రాబాయి, పూనగూడ