ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఏప్రిల్ 10 : ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు. లింగాపూర్ మండలంలోని వంజిరిగూడలో కూడా మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందడం లేదు. దీంతో ప్రజలు చేతి పంపుపై ఆధారపడుతున్నారు. ఒకటే చేతి పంపు ఉండడంతో గంటలపాటు నిరీక్షిస్తున్నారు.
వాంకిడి మండలంలోని లెండిగూడ గ్రామంలో దాదాపు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో నాలుగు చేతి పంపులు ఉండగా.. కేవలం ఒకే చేతి పంపు పని చేస్తున్నది. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం తాగు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం, అధికారుల వైఖరి వల్ల మిషన్ భగీరథ నీరు సరఫరా సక్రమంగా రావడం లేదు.
ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే కొన్ని రోజులపాటు నీరు వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిర్పూర్(యూ) మండలంలోని చోర్పల్లి పంచాయతీ పరిధిలోని పునాగూడ గ్రామవాసులు కిలో మీటర్ల దూరం నుంచి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నారు. బిందెలు ఎత్తుకుని గుట్టలను దాటుతు గుకెడు నీళ్ల కోసం కాళ్లకు చెప్పులు లేకుండా గంటల తరబడి నడిచి నీరు తెచ్చుకుంటున్నారు.
నీటిని నిద్రాహారాలు మాని తెచ్చుకుంటున్నాం. ఉదయాన్నే నీటికోసం బావుల వద్దకు పరుగెత్తాల్సి వస్తున్నది. అధికా రులుకు ఎన్నిసారుల చెప్పినా.. తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారే తప్పా.. శాశ్వత ఏర్పాట్లు చేయడం లేదు. మాతోపాటు మూగ జీవాలు కూడా అల్లాడుతున్నాయి. మిషన్ భగీరథ, బోర్వెల్క్ను మరమ్మతులు చేపట్టినట్లయితే సమస్య తీరుతుంది. అధికారులు స్పందించి గిరిజన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిషరించాలి. – మర్సకుల అశోక్, గుండాల.
బోరు చెడిపోవడంతో పది రోజల నుంచి తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఇందారంలోని శివాలయం వీధిలో పది కుటుంబాలు బోరు బావి చెడిపోవడంతో నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. మిషన్ భగిరథ ఉన్నప్పట్టికీ సరిపడా నీరు రావడం లేదు. మేమంతా బోరు బావిపైననే ఆధార పడేవారం. పది రోజల క్రితం బోరు బావి చెడిపోవడంతో నీటికి తిప్పలు పడతున్నాం. అధికారులు స్పందించి వెంటనే బోరు బావికి మరమ్మతులు చేయించి, నీటి సమస్యను పరిష్కరించాలి. – బాకె భాస్కర్, ఇందారం, జైపూర్.
చెన్నూర్, ఏప్రిల్ 10 : చెన్నూర్ ప్రజలు తాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు వట్టిపోవడంతో బోర్ల నుంచి నీరు రావడం లేదు. చెడిపోయిన బోర్లను అధికారులు మరమ్మతులు చేయించడం లేదు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామం శివాలయం వీధిలో బోరు చెడిపోవడంతో పది కుటుంబాల ప్రజలు పది రోజులుగా తాగునీటికి అవస్థడు పడుతున్నారు.
వీరికి మిషన్ భగీరథ పైప్లైన్ ఉన్నప్పటికీ సరిపడా నీరు రావడం లేదు. భీమారం మండలంలోని ఆరెపల్లి గ్రామంలో గల బీసీ కాలనీలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావుల నుంచి బురద నీరు వస్తున్నది. ఈ కాలనీలో దాదాపు 40 కుటుంబాల వరకు ఉన్నాయి. వీరికి మిషన్ భగిరథ ఉన్నప్పట్టికీ తాగు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిసరన తెలిపారు.
బెజ్జూర్, ఏప్రిల్ 10 : బెజ్జూర్ మండలంలో 22 గ్రామాలు ఉండగా.. ప్రధానంగా తొమ్మిది గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో బారెగూడ, మర్తిడి, రంగాపూర్, కుకుడ, బెజ్జూర్, నాగుల్వాయి, రేచిని, ఇందిర్గాం, కుశ్నపల్లి గ్రామాలవాసులు నీటికోసం తపించిపోతున్నారు. ఈ గ్రామాల్లో 2885 కుటుంబాలు ఉండగా.. 13,071 జనాబా ఉంది.
చేతిపంపులు వట్టిపోవడంతో సమీపంలోని బావులు, చెలిమలు, వాగుల నుంచి నీటిని తోడుకొచ్చుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందింది. ప్రతి ఇంటికి నల్లా ఉండగా అవి పని చేయడం లేదు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ప్రజలు వాగులు, వంకలకు వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి నీటి ఎద్దడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.
మా ఇంటి ముందే మిషన్ భగీరథ నల్లా ఉన్నది. గతంలో ఆ నల్లా నీళ్లు పట్టుకుని తాగే వాళ్లం. కానీ.. ఇప్పుడు నల్లాలో నీళ్లు రావడం లేదు. ఎండలు బాగా ముదిరినయ్. తాగునీటికి గోస అయితాంది. మా ఊరికి కిలో మీటరు దూరంలో ఉన్న వాగుకు పోయి రోజు పొద్దున బిందెడు, సాయంత్రం బిందెడు నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. నల్లాలు సవరిస్తే నీళ్లు వస్తయ్. కానీ.. ఏ సార్లు వాటిని పట్టించుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు పడుడో తెలుస్తలేదు. ఇగ మా గోస ఎప్పుడు దూరమైతదో మాకు మంచి రోజులు ఎప్పుడస్తయో దేవుడికెరుక.
– ఆత్రం దుర్గ, కుకుడ.
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 10 : మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, నస్పూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలు గోదావరికి ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి అవసరాలను గోదావరితోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీరుస్తారు. ప్రస్తుతానికి తాగునీటి కష్టాలు పెద్దగా లేనప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతాయో అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1.20 లక్షలకుపైగా జనాభా ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలకు రోజూ 17.45 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు.
ముల్కల పంప్హౌజ్ నుంచి 10.45 ఎంఎల్డీ నీటిని, మిషన్ భగీరథ నుంచి 7 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలో తొమ్మిది ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీటిని పట్టణంలోని 36 వార్డుల్లో 22,250 నల్లాలకు సరఫరా చేస్తున్నారు. తిలక్నగర్, దొరగారిపల్లి , శ్రీశ్రీనగర్, సాయికుంట, ఎన్టీఆర్ నగర్, రాజీవ్నగర్ ప్రాంతాలకు తొమ్మిది ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 297 హ్యాండ్బోర్లు, 302 పవర్ బోర్ల ద్వారా నీరు అందుతోంది. అయితే పలుచోట్ల బోర్లు ఎండిపోయి నీరు రావడం లేదు.
నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న 25 వార్డుల్లో కొన్ని వార్డులకు సింగరేణి యాజమాన్యం నీటి సరఫరా చేస్తున్నది. మరికొన్ని ప్రాంతాల్లో మున్సిపాలిటీ నీటి సరఫరా అవుతుంది. ఈ వేసవిలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి నది పూర్తిగా ఎండిపోయింది. దీంతో అటు సింగరేణి, ఇటు మున్సిపాలిటీలు నీటి సరఫరా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం సింగరేణి ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, కార్మికేతర ప్రాంతాల్లో సింగరేణి బావుల నుంచి ఒకరోజు విడిచి ఒకరోజు నీటి సరఫరా అవుతున్నది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేసే నీటి సరఫరా కొన్ని ప్రాంతాలకు సక్రమంగా జరగడం లేదు. ఏప్రిల్లోనే నీటి కష్టాలు చూస్తుంటే మే నెలలో ఎండలు ముదిరితే ప్రజలకు నీటి సరఫరా జఠిలం కానుంది.
నాపేరు గాదె పద్మ. మేము 20 ఏండ్లుకుపైగా నస్పూర్లోని జ్యోతినగర్లో నివాసముం టున్నం. ఎండాకాలం వచ్చిందంటే నీళ్లకు గోస అవుతున్నది. బోర్లు, సిస్టం ట్యాంకు నీళ్లతోనే కాలం వెళ్లదీస్తున్నం. ప్రతి ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా మాకు నీళ్లు ఇచ్చేవారు. మంచినీటి కష్టాలపై అధికారులు, నాయకులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. ఎండలు ముదురుతున్న కొద్ది నీళ్లు అడుగంటిపోతాయి. ముందు ముందు మాకు నీళ్ల కష్టాలు తప్పేటట్లు లేవు. అధికారులు, నాయకులు మా బాధలు అర్థం చేసుకోండి. అందరి కంటే మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి రోజు సరిపడా నీళ్లు ఇయ్యాలని వేడుకుంటున్నం.