కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో తప్పుల్లేని కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అవగాహన కల్పిస్తున్నారు. పెరిగే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మరిన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 4,53,538 మంది ఓటర్లు ఉన్నారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305, సిర్పూర్ నియోజకవర్గంలో 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా.. ఓటర్ల జాబితా సవరిస్తుండగా, ఓటర్ల సంఖ్యతో పాటు మరిన్ని పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఆసిఫాబాద్లో కొత్తగా 52 పోలింగ్ కేంద్రాలు, సిర్పూర్ నియోజకవర్గంలో మరో 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశమున్నది. జిల్లాలో ప్రస్తుతం 599 కేంద్రాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం 678 కేంద్రాలు ఏర్పడనున్నాయి. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రెండు కిలోమీటర్ల పరిధి దాటి ఉన్న ఓటర్లను గుర్తించి.. ఫారం 8 ద్వారా ఓటర్ల జాబితా సవరించనున్నారు. ఈ నెల 20, 21వ తేదీల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాపై దృష్టిసారించిన అధికారులు కొత్త ఓటర్ల జాబితా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. ఓటర్ల జాబితాల సరవణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు తదితర విషయాలపై అధికారులు నాయకులు, ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు అటు అధికార యంత్రాంగం ఇటు రాజకీయ పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి.