న్యూఢిల్లీ, జూలై 25: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు.. గతకొద్ది నెలలుగా నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పరుగులు పెట్టిన పసిడి రేట్లు.. ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించాయి. అయితే ఆ తర్వాత మాత్రం క్రమేణా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే దాదాపు గడిచిన 6 నెలల్లో దేశీయ మార్కెట్లో సుమారు 20 శాతం పుత్తడి విలువ దిగజారింది. ఇక వెండి ధరలైతే ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి చూస్తే.. ఏకంగా 44 శాతం క్షీణించడం గమనార్హం.
ఇదీ సంగతి..
ఈ ఏడాది జనవరి 29న భారతీయ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి ధర మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికింది. ఈ ఒక్కరోజే గరిష్ఠంగా రూ.12,000 ఎగిసింది. అలాగే కిలో వెండి రేటు ఆల్టైమ్ హైకి చేరి రూ.4,04,500గా నమోదైంది. జనవరి 27న ఏకంగా రూ.40,500 పుంజుకోవడం విశేషం. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు దూసుకుపోయాయి. తొలిసారి ఔన్స్ గోల్డ్ వాల్యూ 5,602 డాలర్లను తాకింది. అయితే ఫిబ్రవరి నుంచి ఇటు దేశీయంగా, అటు విదేశీ మార్కెట్లో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ తులం గోల్డ్ విలువ రూ.1,47,200 (అన్ని పన్నులతో సహా)గా ఉన్నది. కిలో సిల్వర్ రూ.2,24,700 (అన్ని పన్నులతో సహా)వద్ద ముగిసింది. దీంతో ఆల్టైమ్ హై రికార్డులతో పోల్చితే.. ఇంచుమించుగా గడిచిన 6 నెలల్లో పుత్తడి ధర రూ.35,800 (20 శాతం), వెండి రేటు రూ.1,79,800 (44 శాతం) తగ్గిపోయాయి.
గల్ఫ్ యుద్ధంతో..
ఫిబ్రవరి మొదలు బంగారం, వెండి ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే కారణం. ఈ నేపథ్యంలోనే జనవరి 30న 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి విలువ ఒక్కసారే రూ.14,000 క్షీణించింది. ఆ తర్వాత రోజు (జనవరి 31) కిలో వెండి ధర ఏకంగా రూ.72,500 పడిపోయింది. ఇక అప్పట్నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ధరలు.. ఫిబ్రవరి ఆఖర్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధంతో మరింతగా ఆటుపోట్లకు గురయ్యాయి. పెరిగిన ముడి చమురు ధరలు.. మదుపర్లలో ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తించాయి. ఒకానొక దశలోనైతే బ్యారెల్ క్రూడాయిల్ రేటు 125 డాలర్ల ఎగువకు చేరింది. ఫలితంగా రేట్లు తిరోగమనం బాటే పట్టాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు ఔన్స్ గోల్డ్ వాల్యూ 4,063.70 డాలర్లుగా ఉన్నది. గరిష్ఠ స్థాయితో చూస్తే.. 1,538 డాలర్లు దిగింది.
ఇన్వెస్టర్లలో గుబులు..
ఓవైపు స్టాక్ మార్కెట్లు, మరోవైపు గోల్డ్, సిల్వర్ వంటి కమోడిటీ మార్కెట్లలోనూ ఒడిదుడుకులు ఏర్పడుతుండటంతో మదుపర్లు పెట్టుబడులకు జంకుతున్నారు. నిజానికి ఈక్విటీలు నష్టాల్లో ఉన్నప్పుడు.. తమ పెట్టుబడుల రక్షణకు మదుపర్లు బంగారం కొనుగోళ్ల దిశగా అడుగులేస్తారు. అయితే పెరుగుతున్న ముడి చమురు ధరలతో అటు స్టాక్స్, ఇటు గోల్డ్ వైపునకు చూడలేని పరిస్థితి నెలకొన్నది. కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే.. క్రూడాయిల్ రేట్లు దిగొచ్చి, మళ్లీ బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టే వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తగ్గినట్టే తగ్గి తిరిగి తీవ్రరూపం దాల్చుతున్నది. దీంతో ఇప్పుడప్పుడే మార్కెట్లో స్థిరీకరణకు అవకాశాలు లేవన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఇక రిటైల్ మార్కెట్లో ధరలు ఇంకా తగ్గుముఖం పడుతాయేమోనన్న భావనతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నదని వ్యాపారులు చెప్తున్నారు.
పసిడి ధరల పతనానికి ప్రధాన కారణాలు