ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకంగా సేవలందిస్తున్నది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్వంటి వాటి కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే తిప్పలకు స్వస్తి పలికి నిమిషాల్లోనే పని పూర్తి చేస్తున్నది. ఇలా అన్ని విధాలా భరోసానిస్తున్న ‘ధరణి’పై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారంపై కర్షకలోకం మండిపడుతున్నది. మా మంచికోరే యాప్ను రద్దు చేస్తామంటే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిస్తున్నది.
నిర్మల్, మే 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. గతంలో మాదిరిగా రైతులు దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. అధికారుల చేతి వాటానికి చెక్ పడింది. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులన్నీ ధరణి వల్లే క్రమబద్ధీకరించబడుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు పకడ్బందీ విధానాన్ని రూపొందిస్తూ రైతుల సమగ్ర సమాచారాన్ని సైతం ఇందులో పొందుపరిచారు. భూమి ఉన్న ప్రతి రైతు పక్కాగా యాజమాన్యపు హక్కు కలిగి ఉండేలా.. రైతుకు సంబంధించిన ఆధార్, బ్యాంకు ఖాతా, సెల్ఫోన్ నంబరును కూడా జత చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి ఏ సమాచారం చేరవేయాలన్నా ప్రస్తుతం ధరణి సమాచారమే కీలకమైంది. రైతుబంధు, రైతుబీమాకు సైతం ధరణినే ఆధారమైంది. ఏటా ఆగస్టులో రైతుబీమా కోసం ప్రీమియం చెల్లిస్తూ, రెన్యూవల్ చేసే సమయంలో పాత రైతుల సమాచారాన్ని నేరుగా ధరణి పోర్టల్ నుంచే తీసుకుంటున్నారు. ఇలా అన్ని విధాలా భరోసానిస్తున్న ‘ధరణి’పై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు తిప్పికొడుతున్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతుల మేలు కోరే బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటామని చెబుతున్నారు.
భీంపూర్, మే 31 : ఇపుడు నా కొడుకు తరం. మా తండ్రి, తాతలు చెప్తుండె .. ఆ జమానల ఒక్క పహాణీ తియ్యాలనంటే పట్వారి సారుకు రూ.30- 60 దాకా ఇయ్యవడుతుండె. నా చేతికి ఎవుసం అచ్చినంక సుకా ( కూడా) బ్యాంకుల లోన్లకు ఇసుంటి పనులకు పహాణీలు తీసుకుంటుండే. అపుడేమి గీ కంప్యూటర్లా, కాకరకాయలా. సార్లు రాసిందే బ్రహ్మరాత తీరు. ఒగయాల్ల సార్లు మతిమరిస్తే గింత ఒగ రైతు భూమి ఇంకొకళ్ల పేరిట ఉంటుండె . పెద్ద పట్టాపాసు పుస్తకం అన్నట్లె గనీ ఒక్కొక్కల్లకు ఆళ్ల భూమి యాడనో తెలని పరిస్థితి ఉండె. ఎప్పుడయితే తెలంగాణ సర్కారు అచ్చిందో గపుడు గీ ధరణి తెచ్చిండ్రు. అప్పటినుంచి అందరు కాస్తకారి ( రైతు)లకు ఆళ్లభూమి గురించి పక్కాగా తెలిసిపోయింది. కాంగ్రెసోళ్లకు ధరణి పద్ధతి ఏంటికి పసందుగాకుల్లేదో సమజ్కాకల్లేదు. ఆళ్లకు పిసగింత లేసిందేమో. వోళ్లు ఏమనుకున్నా ధరణి అనేటిది గరీబు సరీబు రైతులకు వరంతీరు. సీఎం కేసీఆర్ సారు ఎన్నో పథకాలు అమలు చేస్తావుంటే ఆళ్లకు కండ్లళ్ల కారం పోసుకున్నట్టున్నది. ఇగో ఒక్కమాటల చెప్పాలనంటే సీఎం కేసీఆర్ సారుతోనే ఎవుసంకు ఎలుగు అచ్చింది.
– ఆకటి నరేందర్రెడ్డి , రైతు ,కరంజి(టీ),భీంపూర్
ధరణి వచ్చిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్నయ్. పైరవీల బాధలేదు. అదనంగా ఖర్చు లేదు. ఒకప్పుడు పహాణిలో తప్పులు వచ్చినా.. భూములు కొనడం, అమ్మడం చేసినా రిజిస్ట్రేషన్ల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. వేలకు వేలు లంచాలు. పట్వారీలు(వీఆర్వోలు) ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ధరణితో అవన్నీ పోయినయ్. ఏడాది కింద ఇల్లు కట్టుకోవడంతో కొంత అప్పు అయింది. చేసిన అప్పు తీర్చేందుకు ఇటీవల కుభీర్ శివారులో నా పేరు మీద ఉన్న 20 గుంటల భూమి అమ్మిన. రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ ఆఫీసుకు రాగానే వేలి ముద్రలు తీసుకున్నరు. ఎలాంటి హడావుడి లేకుండా 15 నిమిషాల్లో పని పూర్తయింది. రైతులు భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా చాలా సులువైంది.
– ముచ్చిండ్ల సాయినాథ్, కుభీర్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపోళ్లు అధికారంలోకొస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరం. ధరణి లేకుంటే మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైతది. అడుగడుగునా పైసలు పంచాల్సి వస్తది. 2012లో మా ఊరిలో ఎకరం భూమి కొన్న. నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన. మస్తు రోజులు తిప్పల పెట్టి పని చేసిన్రు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతుల తిప్పలు పోయినయ్. నెల కింద చింతల్చాందలో మధుసూదన్రెడ్డి దగ్గర ఎకరం భూమి కొన్న. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయింది. కేవలం అరగంటలోనే నయాపైసా ఖర్చు లేకుండా పనైపోయింది. రైతులకు ఇంతగా ఉపయోగపడుతున్న ధరణిపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. – సంత సాగర్రెడ్డి, చామన్పెల్లి, లక్ష్మణచాంద మండలం.