నిర్మల్/ఆదిలాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజే భూ రిజిస్ట్రేషన్తో పాటు పట్టా పాస్ పుస్తకం చేతికందుతున్నది. దళారుల ప్రమేయం లేకుండా అరగంటలోపే ప్రక్రియ పూర్తవుతుండగా, హర్షం వ్యక్తమవుతున్నది. నాడు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా పాపమన్న నాథుడే లేకుండెనని, నేడు సీఎం కేసీఆర్ పుణ్యమాని తిప్పలు తప్పాయని కర్షకలోకం మురిసిపోతున్నది. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ పలుచోట్ల తహసీల్ కార్యాలయాలను సందర్శించి అన్నదాతలను పలకరించగా, వారంతా బీఆర్ఎస్ సర్కారుపై ప్రశంసలు కురిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. రైతులు వ్యవసాయ భూములు కొనాలన్నా.. అమ్మాలన్నా గతంలో మాదిరిగా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆఫీసుల చుట్టూ తిరగడం, అనవసర వ్యయ, ప్రయాసలు తప్పాయి. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న తేదీలోనే రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ కాపీ అందుతున్నది. గతంలో రోజుల తరబడి కాని పని.. ధరణి ద్వారా నిమిషాల్లో పూర్తవుతున్నది. ఒకప్పుడు అధికారుల చేయి తడపనిదే డాక్యుమెంట్ ముందుకు వెళ్లేది కాదు. కానీ.. ఇప్పుడు నయా పైసా ఖర్చులేకుండా పూర్తి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భూముల వివరాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో నిత్యం భూ తగాదాలు జరుగుతుండేవి.
ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భూ రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. రికార్డులను ఆన్లైన్ చేసి ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేయడంతో పాటు కొత్త పాస్ బుక్లను అందించారు. ధరణికి ముందు మాన్యువల్ రికార్డులు ఉండగా, ఎవరి భూములు ఎవరికి సొంతమో తెలియని అయోమయ పరిస్థితి ఉండేది. అప్పట్లో రిజిస్ట్రేషన్ అంటే ఓ ప్రహసనం కాగా, మ్యుటేషన్ చేయించుకోవడానికి నెలలు పట్టేది. ధరణి వచ్చాక నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వెంటనే మ్యుటేషన్ పూర్తయి పత్రాలు చేతికందుతున్నాయి.
వేగంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్..
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవడమే కాకుండా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నది. క్రయ, విక్రయదారులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే మరుసటి రోజు లేదా వారు కోరుకున్న రోజున రిజిస్ట్రేషన్కు సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయానికి క్రయ, విక్రయదారులు, సాక్షులతో కలిసి స్థానిక తహసీల్ కార్యాలయానికి చేరుకుంటే అరగంటలో పని పూర్తవుతుంది. తహసీల్దార్ క్రయ, విక్రయాలకు సంబంధించిన వివరాలు పరిశీలించడం, ధరణి పోర్టల్ ఆపరేటర్ క్రయ, విక్రయదారులు, సాక్షుల ఫొటోలు, వేలిముద్రలు సేకరించడం.. తర్వాత క్రయ, విక్రయదారులు తమ ఇష్ట పూర్వకంగా సరైన భూమిని విక్రయిస్తున్నామని అఫిడవిట్ దాఖలు చేయడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
ఆ వెంటనే తహసీల్దార్ మ్యుటేషన్ను సైతం పూర్తి చేసి ఇందుకు సంబంధించిన 1బీ కంప్యూటర్ ప్రింటెడ్ కాపీని అందిస్తున్నారు. ఒకవేళ భూమిని కొనుగోలు చేసిన రైతుకు అదే గ్రామంలో గతంలో వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పుస్తకం ఉంటే.. అదే పుస్తకంలో తాజాగా కొనుగోలు చేసిన భూమి వివరాలను నమోదు చేసి అందజేస్తున్నారు. ఇదే క్రమంలో భూమిని విక్రయించిన వ్యక్తి పాస్ పుస్తకం నుంచి విక్రయించిన భూమి మొత్తాన్ని తొలగించివేస్తున్నారు. దీంతో మ్యుటేషన్ ప్రక్రియ అక్కడితో ముగిసిపోతుంది. ఒకవేళ కొనుగోలు దారుడికి గతంలో భూమి లేకపోయినా.. పాస్ పుస్తకం లేకపోయినా అతడి ఇంటికే వారం తర్వాత కంప్యూటర్ ప్రింటెడ్ పాసు పుస్తకం పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ధరణితో భూములకు రక్షణ
నా పేరు మీద రాజూరలో ఎకరం 20 గుంటల భూమి ఉంది. దానిని మా ఊరికే చెందిన నవీన్కు అమ్మిన. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉందని, ఖానాపూర్కు రావాలని చెప్పిన్రు. కొడుకు శ్రీనివాస్రెడ్డిని వెంటబెట్టుకొని వచ్చిన. నా వివరాలు, భూమి కొన్న వారి విరాలు తీసుకున్నరు. అరగంటలో పని అయిపోయింది. ఈ ఎండలకు ఆఫీసులో ఎంతసేపు ఉండాల్సి వస్తుందోనని భయపడ్డా. నిమిషాల్లోనే పని పూర్తిచేసిన్రు. రైతులు చాలాసులభంగా భూములను అమ్ముడు, కొనుడు చేసుకునేందుకు ఈ ధరణి మంచిగుంది. ధరణి రాకముందు మస్తు తిప్పలపడేటోళ్లు. ఎప్పుడైనా భూమిని అమ్మేటప్పుడు, కొనేటప్పుడు పహణీలు చూస్తే ఒకరి భూమి ఇంకొకరి పేరున ఉండేది. కొందరు డబ్బులకు ఆశపడి వేరే వాళ్ల పేరున ఎక్కించేవారు. సీఎం కేసీఆర్ సారు రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ ధరణిని తీసుకొచ్చి, భూములకు రక్షణ కల్పించిండు.
పదిహేను నిమిషాల్లోనే పనైంది..
నా పేరు షేక్ హైదర్, మాది నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రం. మా ఊరి శివారులోని సర్వే నంబర్ 39లో ఎం సాయినాథ్కు చెందిన 20 గుంటల భూమిని కొనుగోలు చేసిన. మొదటిసారి భూమి కొనుక్కున్న. రిజిస్ట్రేషన్ కోసం రెండు రోజుల కింద మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న. ఈ రోజు (సోమవారం) ఉదయం 11.30 గంటలకు తహసీల్ కార్యాలయానికి వచ్చిన. ఇద్దరు సాక్షులు కూడా వచ్చిన్రు. పదిహేను నిమిషాల్లోనే పనైపోయింది. నా వివరాలు, భూమి అమ్మిన వారి వివరాలను కంప్యూటర్లో నమోదు చేసుకున్నరు. పట్టా అయిపోయిందని చెప్పిన్రు. ఆన్లైన్ కాపీని కూడా ఇచ్చిన్రు. వారం పదిరోజుల్లో పట్టా పాస్బుక్కు ఇంటికే వస్తుందని చెప్పిన్రు. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి మాలాంటి సామాన్యులకు ఎంతో మేలు చేస్తుంది.
అరగంటలోనే విరాసత్ ఇచ్చిన్రు..
మా తండ్రి పేరు మడె మల్లయ్య. ఆయనకు మేము ముగ్గురం (మడె భీమయ్య, మడె అర్జయ్య, మడె ధర్మయ్య) కొడుకులం. మాది బెజ్జూర్ మండలం అంబాగట్ గ్రామం. మాకు మూడెకరాల భూమి ఉంది. అది మా నాన్న పేరున ఉంది. ఇటీవల ఆయన చనిపోయిండు. మేమంతా సమానంగా పంచుకోవాలనుకున్నం. ఒక్కొక్కరికీ ఎకరం చొప్పున వస్తది. విరాసత్ పట్టాల కోసం వారం కింద మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్నం. ఈ రోజు (సోమవారం) తహసీల్ కార్యాలయానికి రమ్మన్నరు. అరగంటలనే మా వివరాలు, ఫొటోలు తీసుకున్నరు. ఒక్కొక్కరి పేరిట ఎకరం విరాసత్ చేసిచ్చిన్రు. వారంలోపే పట్టా పాస్బుక్కు కూడా వస్తుందని చెప్పిన్రు. ఇదంతా ధరణితోనే సాధ్యమైంది. గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగినా పని కాకపోయేది. ఇప్పుడు అట్లాపోయి.. ఇట్లా వస్తున్నరు. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే..
ఒక్కసారి ధరణిలో ఎక్కితే చాలు..
ధరణి పోర్టల్తో రైతులకు చాలా మేలు కలుగుతుంది. ఒక్కసారి ధరణి వెబ్సైట్లోకి పేరు ఎక్కితే చాలు దానిని మార్చడం ఎవరితరం కూడా కాదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. గిరిజన, గిరిజనేతరులకు కూడా షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించేలా చర్యలు తీసుకున్నది. పెండింగ్లో ఉన్న పుస్తకాలు పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే చాలు టైమ్కు ఆఫీస్కు వస్తే క్షణాల్లో పని పూర్తవుతుంది. ఆన్లైన్ కాపీ వెంటనే ఇస్తున్నాం. వారంలో పట్టా పాస్బుక్ పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తున్నాం.
– సోము, తహసీల్దార్, బజార్హత్నూర్
అనేక సమస్యలకు పరిష్కారం..
రెవెన్యూ వ్యవస్థలో పేరుకు పోయిన అనేక సమస్యలకు ‘ధరణి’ పరిష్కారం చూపుతున్నది. రికార్డులు సక్రమంగా లేని ఎంతోమంది రైతుల భూములు ధరణి ద్వారా రికార్డుల్లోకెక్కాయి. దీని వల్ల చాలా మంది రైతులకు మేలు జరిగింది. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్ బుక్లు అందజేయడం మొదలైనవన్నీ చకచకా సాగిపోతాయి. ఒకసారి భూ వివరాలు ధరణిలో పొందుపరిస్తే ఇక అవకతవకలు జరిగే ఆస్కారం ఉండదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆన్లైన్ పట్టా కాపీ ఇస్తాం. కొత్త పట్టా పాస్బుక్ను పోస్ట్ ద్వారా కొనుగోలుదారు ఇంటికే పంపిస్తాం. – బీ ప్రభాకర్, తహసీల్దార్, నిర్మల్ రూరల్ మండలం
ధరణితో పారదర్శకత
రైతులు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ను వారు కోరుకున్న రోజునే చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల అత్యంత పారదర్శకంగా భూ బదలాయింపు ప్రక్రియ జరుగుతున్నది. తహసీల్ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, గిఫ్ట్, పార్టిషన్ డీడీ, వారసత్వ భూ మార్పులు వంటి పనులను పొందవచ్చు. ఇంటికే పోస్ట్లో పాస్బుక్కును పంపిస్తున్నాం.
– వర్ణ, తహసీల్దార్, సిరికొండ
ఇబ్బందుల్లేకుండా అమ్మకాలు, కొనుగోళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణితో మా ఇబ్బందులు తొలిగిపోయినయ్. గతంలో రోజుల తరబడి తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనయ్యేదికాదు. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో అమ్మకాలు పూర్తవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండానే కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియ జరుగుతున్నది. రైతులకు ధరణి వరంగా మారిందని చెప్పవచ్చు. ఫోన్లో ధరణి పోర్టల్ ఓపెన్ చేసి భూముల వివరాలను తెలుసుకునే అవకాశం లభించింది.
– చెండే వినోద్, రైతు, రాంపూర్, సిరికొండ మండలం