దస్తురాబాద్, డిసెంబర్ 21 : ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగుతుందీ మాసం. ఈ సమయంలో అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రతం. ఈ వ్రతం వల్ల శ్రీ మహాశిష్ణువు.., నిత్యం దీపారాధన వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షలు సిద్ధిస్తాయని నమ్మకం. 17వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు.. జనవరి 13వ తేదీ వరకు కొనసాగనుండగా, ఈ ధనుర్మాస ఉత్సవాలపై ప్రత్యేక కథనం..
ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కార్తీక, మాఘ, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నదని భావిస్తారు. కానీ, ధనుర్మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. విష్ణు ఆలయాల్లో ఈ నెల 17వ తేదీన ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసమంతా ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. భక్తులు వేకువజామునే ఆలయాలకు వచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోగితో (13వ తేదీ) ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. జనవరి 12, 13 తేదీల్లో శ్రీ గోదారంగునాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చుకులు కొండమాచార్యులు, వంశీ చార్యులు తెలిపారు. ఈ వేడుకతో ఈ మాసం ముగుస్తుందని పేర్కొన్నారు.
గోదాదేవి కళ్యాణం..
ధనుర్మాసం పురస్కరించుకొని ఆలయాల్లో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం, విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణు చిత్తడి కుమార్తె గోదాదేవి.. మానవ మాత్రులకు కాకుండా శ్రీ రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్షకు చేపడుతుంది. ధనుర్మాసంలో వేకువజామునే లేచి నిత్యం విష్ణువుకు పద్యం (పాశురం రూపంలో) రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి, వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై.. శ్రీరంగం రమ్మని అమెకు సూచిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో, ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. అలా గోదారంగనాథుల కళ్యాణం జరుగుతుంది. అప్పటి నుంచి విష్ణు ఆలయాల్లో ధనుర్మాసంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణాన్ని అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. వేడుక చూసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీ మహావిష్ణువును ఆరాధించేందుకు, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు ధనుర్మాసం విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, మండలంలోని శ్రీ సీతారామాలయంలో ధనుర్మాసం వెళ్లే రెండ్రోజుల ముందు శ్రీ గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించి, స్వామివారి పల్లకీని ఊరేగిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు…
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామాలయంలో అర్చకులు కొండమా చార్యులు, వంశీ చార్యులు వెకువ జామున స్వామి వార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెలపాటు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తూ, అర్థాన్ని, ధనుర్మాసం ప్రత్యేకత, విశిష్ఠతను భక్తులకు వివరిస్తున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేసించే భోగి వరకు (సంక్రాంతి ముందు రోజు) ధనుర్మాసం కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని అంటున్నారు. ధనుర్మాసమంతా గోదాదేవి(ఆండాళ్) మార్గళి వ్రతం పేరుతో విష్ణు వత్రం చేపట్టి స్వామి వారిని కీర్తిస్తారు. భూదేవి అవతారమైన ఆండాళ్ తల్లి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే ప్రవిత్రమైన, పావై అంటే వత్రం అని అర్థం. ఈ మాసంలో వైష్ణవ ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేయడం మంచిదని అర్చకులు చెబుతున్నారు. జనవరి 12, 13వ తేదీల్లో ఆలయాల్లో శ్రీ గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చుకులు కొండమాచార్యులు, వంశీ చార్యులు తెలిపారు. వేకువ జామునే భక్తులు ఆలయాలకు చేరుకొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.