ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 5 : ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఐదో రోజూ ఆలయ, జాతర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో పాటు ప్రత్యేక వాహనాల్లో కేస్లాపూర్ తరలివచ్చారు. నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు భక్తులు పిల్లాపాపలతో కలిసి నాగోబా దర్శనానికి బారులు తీరారు. జాతరలో వెలిసిన దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద రద్దీ కనిపించింది. నాగోబా ఆలయ అభివృద్ధి కోసం మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భక్తుల ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భక్తులతోపాటు వ్యాపారులకు మాస్క్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జడ్జి సునిత.., ఐటీడీఏ ఏవో రాంబాబు దంపతులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఇన్చార్జి ఈవో రాజమౌళితోపాటు మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ ఆధ్వర్యంలో వారిని శాలువాతో సన్మానించి, నాగోబా ఫొటో అందించారు.