ఎన్హెచ్-44.. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు గల జాతీయ రహదారి. దేశంలోనే ప్రధాన రహదారి. ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్పూర్కు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లు, బస్సుల్లో ప్రయాణికులు.. లారీలు, కంటైనర్లలో సామగ్రిని తరలిస్తుంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రహదారిని నిర్మించగా.. లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి గుంతల మయంగా మారడం, సర్వీస్, స్లిప్ రోడ్లు, అండర్పాస్లు లేకపోవడంతో భారీ యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగే తొమ్మిది ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించిన ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినా ఫలితం లేదు. తాజాగా సీతాగొంది వద్ద వెనుక నుంచి స్పీడ్గా వచ్చిన లారీ కారును ఢీకొనగా కారు కంటైనర్ కిందికి వెళ్లడంతో నలుగురు చనిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
ఆదిలాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ) : జాతీయ రహదారి(ఎన్హెచ్)-44 ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుంచి జైనథ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు డొల్లార వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ నాలుగు వరుసల రహదారి నుంచి రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లావాసులు తమ అవసరాల కోసం హైదరాబాద్తోపాటు మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు ప్రయాణం చేస్తుంటారు. సరుకులు రవాణా చేసే వాహనాలు, కంటైనర్లు కూడా అధికంగా వెళ్తుంటాయి. ఈ రహదారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి వస్తుంది. రహదారి నిర్మాణంలో లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అధికారులు బ్లాక్ స్పాట్స్ గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు, స్లిప్ రోడ్లు, అండర్పాస్లు నిర్మించలేదు.
ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఎన్హెచ్ఏఐ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై గతంలో జందాపూర్ ఎక్స్రోడ్, మావల క్రాసింగ్, భోరజ్ చెక్పోస్టు, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్రోడ్డు, సీతాగొంది ప్రాంతంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్స్గా గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరినా వణుకూ బెణుకు లేదు. గుడిహత్నూర్ మండలం సీతాగొంది వద్ద రోడ్డు పల్లంగా ఉండడంతోపాటు మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వచ్చే వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం సీతాగొంది వద్ద వెనక నుంచి స్పీడ్గా వచ్చిన లారీ కారును ఢీకొనగా కారు కంటైనర్ కిందికి వెళ్లడంతో నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే ఓ లారీ వెనక నుంచి మరో లారీని ఢీకొట్టింది. ఇలా అనేక ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.
వానకాలంలో కురిసిన వర్షాలతో రోడ్డు గుంతల మయంగా మారింది. రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు గుంతల కారణంగా ప్రమాదాలకు గురికావాల్సి వస్తున్నది. హైదరాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారి-44పై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఎన్హెచ్ఏఐ అధికారులు జిల్లాలో రెండు టోల్ప్లాజాలు నేరడిగొండ మండలం రోల్మామడ, జైనథ్ మండలం డొల్లార వద్ద ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నారు. 2008 నుంచి పన్నులు వసూలు తీసుకుంటున్నా రోడ్డు భద్రతను గాలికొదిలేశారు. ఈ రహదారిపై రోజూ కార్లు, బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, ఇతర భారీ వాహనాలు 10 వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్కో టోల్ప్లాజా వద్ద కారుకు రూ.150 మొదలుకుని భారీ వాహనాలకు రూ.955 వరకు వసూలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి రోజూ లక్షల రూపాయలు గుంజుతున్న ఎన్హెచ్ఏఐ రహదారి విషయంలో పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నా పేరు మొయిన్. నాది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తా. జాతీయ రహదారి మీదుగా రోజూ లారీలో సరుకులు తీసుకొని ఇచ్చోడ నుంచి హైదరాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రకు వెళ్తా. ఎన్హెచ్పై మూలమలుపులు, గుంతలు అధికంగా ఉన్నాయి. బైపాస్ల నుంచి వాహనాలు సడెన్గా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మా నుంచి టోల్గేట్ల వద్ద ఫీజు వసూలు చేస్తున్నారే తప్పా.. రోడ్డు బాగు చేయించడం లేదు. ఎన్హెచ్ఏఐ అధికారులు పట్టించుకొని బ్లాక్స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి.