ఉట్నూర్, మార్చి 5 : దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. ఉట్నూర్లోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే దళితబంధు పథకాన్ని ఉపయోగించి జీవితంలో స్థిరపడేలా చూసుకోవాలన్నారు. మొదటి దశలో కొందరిని ఎంపిక చేశారని, వారంతా అదృష్టవంతులన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఉపయోగపడేలా వ్యాపారం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత ఖాతాలో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తితో వ్యాపారం సరిపడకపోతే నలుగురు, ఐదుగురు కలిసి పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తాము విజయ డెయిరీతో మాట్లాడామని, వారు పాలు కొనేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇక కోళ్లఫారం, త్రీ వీలర్, ఆటో లాంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ వందశాతం సబ్సిడీకి ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా పరిషత్ సీఈవో గణపతి, డీఆర్డీవో రవీందర్, ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నర్సరీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని కుమ్రంభీం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నర్సరీని ఆమె తనిఖీ చేశారు. నర్సరీలో మూడు లక్షల మొక్కలు పెంచడం సంతోషంగా ఉందన్నారు. నర్సరీ పెంచుతున్న తీరును చూసి ఎంపీడీవో తిరుమల బృందాన్ని అభినందించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, ఎంపీడీవో తిరుమల, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.