నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను శుక్రవారం పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, గిఫ్ట్ ఏ స్మైల్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని కేటీఆర్.. తన తండ్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎర్రవల్లి నివాసంలో తండ్రి కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక నాటారు. ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్కు, కేసీఆర్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య(రియాన్షి)లతోపాటు కుటుంబసభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పోరాడుతున్న యువతపై జరుగుతున్న నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉం డాలని కేటీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిం దే. కేక్ కటింగ్స్, సంబురాలకు బదులుగా ఆయన విద్యార్థుల సమస్యలపై పోరాటంలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(బీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపారు ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీట్ లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులు, విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు.

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్లోని కోదండ రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేటీఆర్ పేరుపై అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మెదక్లో గొడుగులు పంపిణీ చేశారు. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నగర నేతలు, సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు అధునాతన కానుక అందజేశారు. గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ఆధారిత రూ.10 లక్షల విలువైన హ్యూమనాయిడ్ రోబో టీచర్ను అందించారు. రోబో టీచర్ను హ్యూమనాయిడ్ ల్యాబ్ ప్రతినిధులు, నాయకులతో కలిసి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆవిష్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సిరిసిల్లలో బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కేక్లు కట్ చేసి జననేత కేటీఆర్కు బర్త్ డే విషెస్ తెలిపారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పూజలు జరిపారు. ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. అమెరికాలోని కెంటకీ స్టేట్ లూయీవిల్లీలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై కేక్కట్ చేశారు. లెక్సింటన్ సిటీలో బీఆర్ఎస్ యూఎస్ నాయకుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి ఇంట్లో ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్లో కేటీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించగా ఎర్రబెల్లితోపాటు టీఏవీ అధ్యక్షుడు వీ ప్రకాశ్, ప్రముఖ సినీ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమనేత మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.