నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్
జిల్లా పోలీసులతో నెలవారీ సమీక్షాసమావేశం
నిర్మల్ చైన్గేట్, మే 17 : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లలో పెండింగ్లో ఉన్న యూఐ కేసులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఛేదించి, బాధితుల్లో నమ్మకం పెంచాలని సూచించారు. కోర్టు విధులు నిర్వహించే పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేసి, కన్వెక్షన్ రేటు పెంచాలన్నారు. అందుకు సాక్షులను సరైన విధంగా ప్రవేశపెట్టాలని సూచించారు.
అవసరమైతే మెజిస్ట్రేట్, పీపీ సూచనలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. టీఎస్కాప్, 100 డయల్ కాల్స్ వచ్చినపుడు వాటికి హాజరయ్యే, క్లోజింగ్ విధానంపై అధికారులకు వివరించారు. హెచ్ఆర్ఎమ్ఎస్ అప్లికేషన్ ద్వారా పోలీస్ శాఖలో కాగిత రహిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులపై మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని సరైన మార్గం సూచించడం రిసెప్షన్ సిబ్బంది బాధ్యత అన్నారు. నేరాలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరిస్తూ ముమ్మరంగా రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. బాధ్యతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతారన్నారు. అనంతరం ‘యువత మేలుకో గంజాయి మానుకో’ వీడియోసాంగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ పాటను రచించిన డీఎస్పీ జీవన్రెడ్డిని, గానం, సంగీతం అందించిన ఎలిశెట్టి సుదర్శన్ను, రికార్డింగ్ చేసిన శనిగారపు రాజును ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మహేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సీఐలు శ్రీనివాస్, అజయ్బాబు, వినోద్, ప్రవీణ్కుమార్, రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు, ఐటీసెల్ ఎస్ఐ రవికుమార్ ఉన్నారు.