కుభీర్ : కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ( Kapas Kisan App ) ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం.నారాయణ ( Narayana ) సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర ( MSP )కు సులభంగా , మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనారి క్లస్టర్లోని హoపోలి, గోడాపూర్ గ్రామాల పత్తి రైతులకు కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.
ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్లో రద్దీని తగ్గించడానికి , క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందన్నారు.
ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.
పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.