గుడిహత్నూర్, నవంబర్ 15 : గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అందిన కూలీ డబ్బుల రికార్డులను సమర్పించారు. గుడిహత్నూర్ పరిధిలో చేపట్టిన పనుల్లో మూడేళ్లకు గాను రూ.కోటిన్నరకు పైగా ప్రభు త్వ నిధులను ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు స్వాహా చేసినట్లు స్పష్టమైంది.
మన్నూర్, ముత్నూర్తో పాటు, మరి కొన్ని గ్రామపంచాయతీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు సామాజిక ప్రజా వేదికలో తేటతెల్లమైంది. దీనికి బాధ్యులను చేస్తూ ఏపీవోతో పాటు మరో ముగ్గురు సాంకేతిక సహాయకులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీలు రాథోడ్ రాజేశ్వర్, సిద్ధిఖీ, ఎస్టీఎం నరేందర్, ఎంపీడీవో సునీత, ఎస్ఆర్పీలు రవీందర్, దత్తు, ఈజీఎస్ ఏపీవోలు సుభాషినిరెడ్డి, సంగీత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.