మంచిర్యాల, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని.. నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఉన్నది ఓట్ల యావ మాత్రమేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్ఘాటించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100 పడకల ప్రభుత్వ దవాఖానను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ప్రభుత్వ దవాఖాన ఉండేదన్నారు. కానీ.. ఈరోజు మంచిర్యాలలో 500, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో 400 పడకల ఆస్పత్రులు కడుతున్నామని, బెల్లంపల్లిలో 100 పడకలు, కాగజ్నగర్లో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నామన్నారు. మారుమూల ఆసిఫాబాద్, మంచిర్యా ల జిల్లాలకు ఇన్ని దవాఖానలు వస్తున్నాయంటే కారణం తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడమేనన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇప్పటికే మంచిర్యాలలో ఓ కాలేజీని ప్రారంభించుకున్నామని, ఈ ఏడాది నిర్మల్, ఆసిఫాబాద్ల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటామన్నా రు. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక రిజర్వేషన్ సీఎం కేసీఆర్ కల్పించనున్నట్లు తెలిపారు. ‘మా కార్మికుల పిల్లలు కార్మికులు కావొద్దు.. డాక్టర్లు కావా లి’ అని రాబోయే విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్లు అమలు చే యాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. ఎంబీబీఎస్, నర్సింగ్, పా రామెడికల్ మూడింటిలోనూ సింగరేణి కార్మికుల ప్లిలలకు రిజర్వేషన్లు కల్పించి, త్వరలోనే మన పిల్లలను డాక్టర్లుగా, పారామెడికల్ అసిస్టెంట్లుగా, నర్సింగ్ సూపరింటెండెంట్లుగా చూడబోతున్నామని చెప్పారు.
సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చే విధానాన్ని గత ప్రభుత్వాలు తీసేస్తే, కేసీఆర్ సీఎం అయ్యాక 12,600 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని, అవి కాకుండా మరో 3వేల ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. దీంతో 15వేల పైచిలుకు మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చి సింగరేణికి యువరక్తం తీసుకొచ్చారన్నారు. సింగరేణి లాభాల వాటాను 30 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మొన్న రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని మేం ప్రైవేటుపరం చేయం.. అది మా చేతుల్లో ఎక్కడుంది 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అని మోదీ చెబితే.. ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి తెలంగాణలో నాలుగు బొగ్గుబావులను మేం ప్రైవేటుపరం చేస్తాం. వాటిని వేలం వేస్తాం తప్పా సింగరేణికి ఇవ్వమని చెప్పారన్నారు. అంటే ఇది నోటితో నవ్వి.. నొసిటితో ఎక్కిరించుడు కాదా అని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో చెప్పిన మాట నమ్మాలా? లేక రామగుండం గల్లీలో మాట్లాడిన రాజకీయ మాటలు నమ్మాలా? మోదీ సమాధానం చెప్పాలని నిలదీశారు. నిజంగా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరించొద్దని రాసిన లేఖపై స్పందించాలన్నారు. బొగ్గు బావుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణికే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారన్నారు. అది జరిగితే మరికొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, సింగరేణి లాభాలు పెరిగితే కార్మికులకు బోనస్ కూడా పెరుగుతుందన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు ఇచ్చి నష్టాల పేరిట అమ్మేశారని, రేపు సింగరేణి విషయంలోనూ అదే జరుగొచ్చన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లిగ్మైట్ గనులు కేటాయించిన మోదీ సర్కార్.. తెలంగాణ సింగరేణికి బొగ్గు గనులు ఎందుకు ఇవ్వదో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. సింగరేణి బతకాలంటే.. బీజేపీ పోవాలన్నారు. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో మనం బయల్దేరాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక పక్షపాతి, కార్మిక ఆత్మబంధువైన కేసీఆర్ ప్రభుత్వాన్ని కార్మిక సోదరులు బలోపేతం చేసుకుంటేనే సింగరేణి సంస్థ మరో పది కాలాల పాటు మనుగడ సాగిస్తుందన్నారు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే గ్రూప్-4లో 1000 ఉద్యోగాలు పడబోతున్నాయని చెప్పారు. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ప్రత్యేకంగా రాష్ట్రంలో 400 గురుకులాలను ప్రారంభించి.. కేజీ నుంచి పీజీ వరకు స్కూళ్లు, కాలేజీలు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో ఆడపిల్లలు చదువుకోవాలని ఎస్టీ రెసిడెస్సియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇచ్చారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా.. మన కేసీఆర్ సీఎం అయ్యాక 17 కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కరోనా రాక ముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు నియోజకవర్గానికో కేంద్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ రోగులు మన బెల్లంపల్లిలోనే సింగిల్ యూజ్ పద్ధతుల్లో రేపటి నుంచే డయాలసిస్ సేవలు పొందవచ్చాన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 50 లక్షల డయాలసిస్లు ఉచితంగా చేశామని, ఒక డయాలసిస్ సేవల కోసమే ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. మీటర్లు పెట్టలేదని మన రాష్ర్టానికి ఇచ్చే 30 వేల కోట్ల రూపాయాలను కేంద్రం ఆపేసిందన్నారు. బోరుబావుల కాడ మీటర్లు పెట్టమనడం నిజం కాకపోతే ఎందుకు రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఆపారో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మా పథకాలన్నీ కాపీ కొడుతూ.. మమ్ములనే ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఆ తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలపాలన్నదే మా తపన అని చెప్పారు. ఏ నాటికైనా తెలంగాణపై, సింగరేణిపై, బెల్లంపల్లిపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉంటదా లేక నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ప్రేమ ఉంటదా ఆలోచించాలన్నారు. వాళ్లది ఓట్ల యావైతే, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చే నావ అంటూ అభివర్ణించారు.
ఈ దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు, డాక్టర్లను తయారు చేసే రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ మాత్రమే అన్నారు. వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. ప్రజల పక్షాన పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. మళ్లీ కరోనా వచ్చినా మనకు మాత్రం ఇబ్బంది ఉండదన్నారు. రాష్ట్ర ప్రజలను కాపాడుకోడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ రోజు జిల్లాలో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ఉందంటే అది సీఎం కేసీఆర్ చొరవతోనే అని చెప్పారు.
తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అందుకే దేశంలోని రైతులంతా తెలంగాణనే చూస్తున్నారన్నారు. దేశానికి అవసరమైన రైతు విధానం తీసుకొచ్చే సత్తా ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3.50 లక్షల కోట్లు కేవలం రైతు సంక్షేమానికే ఖర్చు పెట్టిందన్నారు. ఎవరి ఊహలకు అందకుండా వరుసగా పదోసారి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో వేస్తుందన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను వైద్యరంగంలో బలోపేతం చేసిన మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.
కొత్తగా ప్రారంభించుకున్న 100 పడకల దవాఖానకు డాక్టర్, స్టాఫ్ నర్సులు, సిబ్బందిని వెంటనే నియమిస్తామన్నారు. డయాలసిస్ సెంటర్ రేపటి నుంచే పని చేయడం మొదలుపెడుతుందన్నారు. మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి సహకారం కావాలని, పోస్టుమార్టం రూమ్, అల్ట్రాసౌండ్ మిషన్లు, జనరేటర్, కాంపౌండ్ వాల్ కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పెద్ద లిస్టు ఇచ్చారన్నారు. వారం లోపల మా కమిషనర్ అజయ్ను ఇక్కడికి పంపించి ఆసుపత్రికి ఏం అవసరముంటే అది సమకూరుస్తామన్నారు. మంచిర్యాల, హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లు, పీహెచ్సీ బిల్డింగ్లు కావాలని ఎమ్మెల్యే అడిగారని, వారి కోరిక మేరకు జిల్లా వైద్యాధికారుల నుంచి రిపోర్ట్ తెప్పించుకొని వాటితోపాటు అవసరమున్న చోట్ల పల్లె దవాఖానలు మంజూరు చేస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.