కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పడిన తర్వాత పల్లెల ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామాలను పునర్విభజన చేసి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. 500 జనాభా కలిగిన గూడేలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసి అధికారాలు, బాధ్యతలను స్థానికులకే అప్పగించారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 173 గ్రామ పంచాయతీలుండగా, కొత్తగా 162 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఇంతకాలం పాఠశాలలు, ఇతర తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన 99 గ్రామ పంచాయతీలకు మొదటి విడుతలో భవనాలను మంజూరు చేశారు.
గ్రామ పంచాయతీల పునర్విభజనలో భాగంగా జిల్లాలో కొత్తగా 162 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయగా, వాటిలో 99 గ్రామ పంచాయతీల్లో పక్కా భవనాలు నిర్మించేందుకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 65, సిర్పూర్-టీ నియోజకవర్గంలో 34 కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున రూ.19.80 కోట్లు మంజూరు చేసింది.
దీంతో కొత్త పంచాయతీల్లో సకల హంగులతో గ్రామ పరిపాలన సౌలభ్యం కోసం ఉపయోగపడేవిధంగా నిర్మాణాలు చేపట్టింది. కొన్ని భవన నిర్మాణాలు పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంత కాలం పాఠశాలలు, ఇతర తాత్కాలిక భవనాల్లో కొనసాగిన కొత్త గ్రామ పంచాయతీల పాలనా వ్యవహారాలు ఇక కొత్త భవనాల్లోకి మారుతున్నాయి. కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలతో ఆయా గ్రామాలకు సరికొత్త కళ వచ్చింది. ఇటీవల పలు గ్రామా ల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. కొ త్త పంచాయతీల్లో భవనాలు అందుబాటులోనికి రావడంతో సర్పంచ్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.