దండేపల్లి, డిసెంబర్ 18 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోకాసిగూడెం ఓ మారుమూల గ్రామం. గ్రామానికి ఉన్న వాగుపై వంతెన సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే లో లెవల్ వంతెన మునిగేది. గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ గ్రామంలోనే ఉండాల్సి వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో నాలుగైదు కిలో మీటర్లు తిరిగి లింగాపూర్ మీదుగా ప్రధాన రహదారికి చేరుకోవాల్సి వచ్చేది.
స్వరాష్ట్రం సాధించుకున్నాక గ్రామస్తుల కల సాకారమైంది. 2021లో అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సహకారంతో వాగుపై వంతెన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేయడం, వంతెన పనులు చకచకా పూర్తి కావడంతో ఈ యేడాది సెప్టెంబర్ 16న నూతన వంతెనను దివాకర్రావు ప్రారంభించారు. దీంతో మోకాసిగూడ వాసుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మోకాసిగూడకు చెందిన విద్యార్థులు పాఠశాల, కళాశాలకు వెళ్లాలన్నా, నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, వైద్య సౌకర్యాలు పొందాలన్నా వాగు దాటాల్సిందే. ఎవరైనా అనారోగ్యం పాలైతే గ్రామానికి ఈ దారి గుండా 108 చేరుకోవాల్సిన పరిస్థితి. గర్భిణులను 102 వాహనంలో వైద్యపరీక్షలకు తీసుకువెళ్లాలన్నా ఇదే ఆధారం. వర్షాకాలంలో వాళ్లు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో 2021లో వంతెన మంజూరైంది.
లో లెవల్ వంతెనపై నుంచి గ్రామస్తులు పడుతున్న కష్టాలను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి రూ.1.58 కోట్ల పీఎంజీఎస్వై నిధులు మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధుల చొరవతో గుత్తేదారు పనులు పూర్తి చేయడంతో వంతెన పూర్తయింది. దీంతో గ్రామస్తుల దశాబ్దాల కల నేరింది. ఇప్పుడు గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా, బయటి గ్రామాల ప్రజలకు ఇక్కడికి రావాలన్నా ఇబ్బందులు తొలిగిపోయాయి. మోకాసిగూడ నుండే కాక అల్లీపూర్, గుడిరేవు, లక్ష్మీకాంతాపూర్ గ్రామాల ప్రజలు కూడా ఇదే వంతెన పైనుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇది కేసీఆర్ సర్కారు వల్లే సాధ్యమైందని గ్రామస్తులు అంటున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులు మొదలయ్యేవి. వాగు పొంగినప్పుడు అది ఇడిసేదాక ఆగుడే. లేకుంటే ఐదారు కిలోమీటర్లు లింగాపూర్ రోడ్డు మీదికెల్లి పోయేటోల్లం. వాగు అవుతల మేదరిగూడెం, నాగసముద్రం, మాకులపేట ఊరోల్లు పొలానికి రావాలన్నా కష్టం అయితుండే. అల్లీపూర్, గుడిరేవు, లక్ష్మీకాంతాపూర్ ఊరోల్లు కూడా ఇటు దిక్కు వచ్చేటోల్లు కాదు. అప్పటి తెలంగాణ సర్కారు మా సమస్యను గుర్తించి వంతెన కట్టింది. ఇప్పుడు మా కష్టాలు తీరినయ్.
– జిల్లపెల్లి మల్లేశ్, గ్రామస్తులు, మోకాసిగూడెం
వాగుపై వంతెన పూర్తి చేయడంతో మా ఇబ్బందులు తొలిగినయ్. మంచి పని చేసిన తెలంగాణ సర్కారును మరిచిపోం. మా గ్రామస్తుల కష్టాలు ఇక నుంచి తీరినట్లే. పిల్లలు బడికి పోవాలన్నా, పొలానికి పోవాలన్నా ఎన్నో తిప్పలు పడ్డాం. బ్రిడ్జి పూర్తి చేసి, మమ్ములను కేసీఆర్ సర్కారు ఆదుకున్నది. మూడు నెలల కింద దివాకర్రావు వచ్చి ప్రారంభించిండు. ఇప్పుడు సమస్యలు తొలిగిపోయినయ్. మూడు గ్రామాల కష్టాలు దూరమైనయ్.
– జిల్లపెల్లి రవి, మోకాసిగూడెం.