మంచిర్యాల, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ నేతల అక్రమ దందాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతున్నది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా దోచుకు తిందామనే రీతిలో వ్యవహరిస్తుండగా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, రేషన్ బియ్యం, ఓపెన్ కాస్టు మట్టి తరలింపు.. ఇలా అన్ని దందాల్లో చెన్నూర్ నియోజకవర్గ నాయకుల ‘హస్తం’ ఉన్నట్లు తెలుస్తున్నది. మహారాష్ట్రలోని సిరోంచ కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రేషన్ దందా చేసే వీరన్న గురువారం చెన్నూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు, రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించడంలో వీరప్పన్లాంటోడన్న ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. ‘ఈయన పేరు చెప్తే చాలు.. సివిల్ సప్లయ్, పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టుకున్న బియ్యం సైతం వదిలేస్తారనే పేరు ఉంది. అర్ధారాత్రి 12 గంటలకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకుంటే.. తెల్లారే సరికి ఆ లెక్కలు రెండు, మూడు క్వింటాళ్లల్లోకి మారిపోతుంటాయంటరు.” పోనీ సిరోంచ పోయి చర్యలు తీసుకుందామంటే.. అది మన స్టేట్ కాకపాయే అంటూ.. అధికారులు ప్రతిసారి దాట వేస్తుంటారు.
అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఇన్ని రోజులు దందా నడిపిన వీరన్నను మూడు నెలలుగా కాంగ్రెస్ నాయకులు పట్టిపీడిస్తున్నట్లు తెలిసింది. చెన్నూర్ మీదుగా సిరోంచ వెళ్లే రేషన్ బియ్యం లారీలను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల ఓ కాంగ్రెస్ లీడర్ బ్లాక్మెయిల్ చేసి రూ.మూడున్నర లక్షలు వసూలు చేయగా, ఆ విషయం తెలుసుకున్న మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సైతం వీరన్న దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. కాగా ఈ విషయంపై రేషన్ దందా వీరన్న ఎమ్మెల్యే వివేక్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం దందా చేస్తాడని తెలిసినా.. వీరన్నను ఎమ్మెల్యే కలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దందా మానుకోమని మందలివ్వాల్సిన ఎమ్మెల్యే మెత్తగా మాట్లాడి పంపడం పలు విమర్శలు తావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఫండ్ ఇస్తానని.. నా దందాకు ఎవ్వరూ అడ్డురాకుండా చూసుకోవాలనే ప్రపోజల్ను వీరన్న ఎమ్మెల్యే ముందు పెట్టినట్లు ఆ పార్టీ నాయకుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రేషన్ దందా వీరన్న వివేక్ను ఎందుకు కలిశారో, ఏం మాట్లాడారో తేలాల్సి ఉంది.
ఇక చెన్నూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు అన్ని దందాలను దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూర్ క్వారీల ఇసుకను అక్రమ మార్గాల్లో తరలించడంలో దిట్టగా పేరున్న ఓ మాజీ స ర్పంచ్, ఇప్పుడు అధికారిక కాంగ్రెస్లో చేరా డు. మూడు నెలలుగా ఆయన యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు. అనుమతి లేని క్వారీల నుంచి సైతం పట్టపగలే ఇసుకను తరలిస్తున్నా.. ఆపేవారు, అడిగేవారు లేకుం డా పోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు వచ్చాయి. స్పందించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు “మా దృష్టికి రాలేదు.. వస్తే చర్యలు తీసుకుం టాం’ అని చెప్పడం తప్ప.. ఏ ఒక్క రోజూ కూ డా అటువైపు కన్నెత్తి చూసింది లేదు. దీనికి కారణం సదరు వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో ఉండటమేనని తెలిసింది.
మరోవైపు చె న్నూర్లో సీనియర్ నాయకుడిగా పేరున్న రాజిరెడ్డికి.. అదే పార్టీకి చెందిన హేమంత్రెడ్డికి అసలు పడడం లేదట. ఇద్దరూ ఒకరిపై మరొకరు నిత్యం ఎమ్మెల్యే వివేక్ను కలిసి ఫిర్యాదు లు చేసుకుంటున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఎమ్మెల్యే పడిపోయినట్లు తెలుస్తుంది. ఇక జైపూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులకు పడటం లేదట.. ఓపెన్ కాస్టు నుంచి మట్టి తరలించే వ్యవహారం ఇక్కడ నాయకులు నేనంటే.. నేనంటూ కొట్టుకుంటున్నరట. ఇలా ఏ దందా చూసినా కాంగ్రెస్ నాయకుల పేర్లే వినిపిస్తుండడంతో పార్టీ పరువుపోతుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ ఎన్నికల ముందు ఇలాంటి పెంట పనులు చేస్తే ప్రజలకు ముఖం ఎలా చూపించుకోగలమని బాధపడుతున్నారు. ఎన్నికలకు ముందు అక్రమ దందాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వివేక్.. ఇప్పుడు తన కండ్ల ముందే అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే వివేక్ దందాలు బంద్ చేయయని కాంగ్రెస్ నాయకులకు చెబుతారా.. లేక ఏం పట్టీపట్టన్నట్లు మిన్నకుండిపోతారా.. అనేది తేలాల్సి ఉంది.