కేంద్రం విధానాలకు నిరసనగా చేపట్టిన 48 గంటల సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు రెండో రోజైన మంగళవారం కదం తొక్కారు. మోదీ సర్కారు తీరు మార్చుకోవాలని, ప్రైవేటీకరణ వద్దని ముక్త కంఠంతో నినదించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకుల ఉద్యోగులతోపాటు అంగన్ వాడీ, ఇతర సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కార్మికుల గైర్హాజరుతో సింగరేణి గనులు, ఓసీపీలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
ఎదులాపురం/నిర్మల్ టౌన్/ముథోల్, మార్చి 29 : కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంపై అఖిల పక్షం నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై మోయలే ని భారం వేసిందని విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సంపూర్ణమైంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఏజీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తించారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నభోజన కార్మికులు అందరూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నదని గుర్తు చేశారు. బోథ్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మంచిర్యాల జిల్లాలో రెండో రోజూ మంగళ వారం విజయవంతమైంది. సమ్మెలో బీమా, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
నిర్మల్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని సోఫినగర్లో బీడీ యాజమాన్యం కంపెనీ ముందు బీడీ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ముథోల్ మండల కేంద్రంలోని బీడీ కంపెనీ, ఇటుక బట్టి కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.