తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అమరవీరుల సంస్మరణ ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని.. స్తూపాల వద్ద పూలమాలలతో నివాళులర్పించారు. వీరులకు జోహార్లు అంటూ నినదిస్తూ.. వందనం చేశారు. కలెక్టరేట్లు, జడ్పీ, మున్సిపల్ కార్యాలయాలు, పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సంతాప తీర్మానాలు చేశారు. అమరుల కుటుంబాలను సన్మానించారు. వారి త్యాగాలను గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ‘అమరవీరుల సంస్మరణ’ నిర్వహించారు. జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు తదితర ఉన్నతాధికారులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. వీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. తల్లిదండ్రులు తమ బిడ్డల త్యాగాలను స్మరించుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో నిర్వహించిన అమరవీరుల సంస్మరణలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు అమరుల త్యాగాలను గుర్తు చేశాయి. బోథ్లో అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి అమర వీరుల కుటుంబాలను సన్మానించారు. నిర్మల్ పట్టణంలోని జడ్పీ సమావేశం మందిరంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకులు, అధికారులతో కలిసి అమరవీరుల ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ సంతాప తీర్మానం చేశారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. – ఎదులాపురం/బోథ్/నిర్మల్ టౌన్, జూన్ 22
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద గల అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి నివాళులు అర్పించారు.
బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో అమరుల సంస్మరణకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి హాజరయ్యారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ రాజేశం పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాకేంద్రంలోని అమరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్ నివాళులర్పించారు.