పెంబి ఆగస్టు 1: గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మారుమూల మండలంలో 320 మంది గిరిజన రైతులు ఒక్కతాటి పైకి వచ్చి రూ. 32 లక్షల మూలధనంతో మండలస్థాయిలో ఒక్క సంస్థగా ఏర్పాటు కావడం చాల గొప్ప విషయమని కలెక్టర్ రైతులను అభినందించారు. ఈ సంస్థను సరైన మార్గంలో నడిపి గిరిజన ప్రజలకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులతో పాటు అధిక దిగుబడిని అందించగల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తరఫున ఈ సంస్థకు ఎల్లవేళలా అన్ని విధాలుగా సహాయ, సహాకారాలు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, రైతులు సంఘటితంగా ముందుకెళ్తే అభివృద్ధి సాధ్యమని ఆయన సూచించారు.
అనంతరం ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ…రైతుల డిమాండ్ మేరకు నాబార్డ్, ఐటీడీఏ సంస్థల సంయుక్త సహకారంతో ఈ గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థకు అవసరమైన గోదాములు రాయితీపై నిర్మించేలా సహకరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఐటీడీఏ తరఫున గిరిజనులకు రాయితీపై మామిడి, జామా, కొబ్బరి, మునగ, మొదలైన పండ్ల తోటలకు సంబంధించిన నాణ్యమైన మొక్కలను అతి తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు. అనంతరం సంస్థ భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికలను అధికారులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, జడ్పీటీసీ భూక్యా జానుబాయి, ఎంపీపీ కవిత, సర్పంచ్ పూర్ణచందర్గౌడ్, మ్యాక్స్ చైర్మన్ రామేశ్వర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, నాబార్డ్ డీడీఎం వీరభద్రమ్, ఏడీఏ సుజాత, స్పయిస్ బోర్డ్ డీడీ సుందరేశన్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో సుధాకర్, రిలయన్స్ సీఆర్డీ పౌండేషన్, డ్రీమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, రైతులు, తదితరులున్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 1: పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని విశ్వనాథ్పేట్, బంగల్పేట్, బుధవార్పేట్, విశ్వనాథ్పేట్, శాంతినగర్ కాలనీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కాలనీలోని డ్రైనేజీలను పరిశీలించి, నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సుభాష్ చందర్, ఇరిగేషన్ అధికారి రామారావు, తదితరులున్నారు.