నస్పూర్, మే 23 : కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరికృష్ణతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 136,
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 89, మెప్మా ఆధ్వర్యంలో 10, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 51 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. లారీలు, డ్రైవర్ల సర్దుబాటుపై సంబంధిత కాంట్రాక్టర్లు శ్రద్ద తీసుకోవాలని సూచించారు. వాహనాల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్లలో నమోదు చేయాలని తెలిపారు. ట్యాబ్ ఎంట్రీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నస్పూర్, మే 23 : గోవాలో ఈ నెల 19న జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్స్చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోవాలోని యూనివర్శల్ 369 షోటోకన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో జిల్లా కేంద్రంలోని జెన్ శిటో రియు కరాటే స్కూల్ విద్యార్థులు నిహారిక, శ్రీనిధి, జోష్మిత, ఆనందన, శ్రీగౌతమ్, సాయిరోహన్, మనీష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు.