వేమనపల్లి, జనవరి 18 : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులతో స్నేహంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. తహసీల్దార్, మండల పరిషత్ అధికారులు ప్రభుత్వ పథకాల అమలు, దరఖాస్తుల ప్రక్రియపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట మండల తహసీల్దార్ సదానందం, ఎంపీవో బాపు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.