నస్పూర్, ఫిబ్రవరి 10 : పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో యాదయ్యతో కలిసి విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు -సన్నద్ధత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్పై ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తయ్యిందని, రివిజన్పై దృష్టి పెట్టాలన్నారు.
గత పరీక్షల ప్రశ్నా పత్రాల ద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంచాలని, ఎలాంటి అపోహలు, భయం లేకుండా పరీక్షలు రాసే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ కచ్చితంగా పాటించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బియ్యం నిల్వలు ప్రతి రోజూ రిజిష్టర్లో నమోదు చేయాలని, పురుగులు పట్టిన బియ్యం వస్తే వెంటనే సంబంధిత తహసీల్దార్, డీఈవోకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ వారంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు పాఠశాలలను సందర్శిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్రావు, డీసీఈబీ కార్యదర్శి భీంరావు, సహాయ కార్యదర్శి కుమారస్వామి, విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
నస్పూర్, ఫిబ్రవరి 10 : ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పాటు పని కల్పించాలని కలెక్టర్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో జల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రితో కలిసి ఏపీవోలు,ఏపీఎంలు, ఈసీలు, సెర్ప్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీపథకంలో భాగంగా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని,కూలీ ధరలు, పని దినాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కుటుంబాలకు వంద రోజుల పాటు పని కల్పించే విధంగా అధికారులు దృష్టి సారించాలన్నారు. వేసవికాలం సమీపిస్తున్నందున పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సహాయం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
హాజీపూర్, ఫిబ్రవరి 10 : జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయాల అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సమయపాలన పాటిస్తూ అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాలు జారీచేశారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు తహశీల్దార్తో పాటు సిబ్బంది అందుబాటులో ఉండాలని, కొంద రు జిల్లా హెడ్ క్వార్టర్ దాటిపోయినా సమాచారమివ్వడం లేదని, ఇకపై నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.