మంచిర్యాలటౌన్, జనవరి 6 : ప్రజాపాలన దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కావాల్సినన్ని కంప్యూటర్లను ఏర్పాటు చేసి నిర్ణీత గడువులోగా దరఖాస్తులన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 17వ తేదీ కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఏ మారుతీప్రసాద్, మేనేజర్ విజయ్కుమార్, సిబ్బంది ఉన్నారు.