హాజీపూర్, జూన్ 18 : తెలంగాణ ప్రభుత్వం మిషన్భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గుడిపేటలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో మిషన్భగీరథ ఆధ్వర్వంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) రాహుల్, మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో 54 ఆవాసాలకు అందించిన నీటిని గత తొమ్మిదేళ్లలోనే ఎంతో అభివృద్ధి చేసి ప్రస్తుతం 667 ఆవాసాలకు అందిస్తున్నామన్నారు. 9 ఓహెచ్డీ ఆర్లను 32కు పెంచామని, అలాగే 100 కిలోమీటర్లు వ్యాపించి ఉన్న గ్రిడ్ పైపులైన్లను 1,525 కిలోమీటర్లను పెంచుకున్నామని చెప్పారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించేందుకు 201 కిలోమీటర్లు ఉన్న పైపులైనును 2,729 కిలోమీటర్లకు పెంచడం జరిగిందన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 418 ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లను 918కు పెంచుకున్నామని పేర్కొన్నారు. అలాగే 8,600 ఇండ్లకు ఉన్న నల్లా కనెక్షన్లను ఇప్పుడు 1,80 వేల ఇండ్లకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అలాగే ఉదయం గ్రామాల్లోని ఓహెచ్ఆర్ ట్యాంక్ల నుంచి గ్రామ పంచాయతీల కార్యాలయం వరకు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమం లో డీఆర్డీఏ అధికారి శేషాద్రి, గుడిపేట గ్రామ సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి-రాజయ్య, జడ్పీటీసీ పుస్కూరి శిల్ప, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, హాజీపూర్ సర్పంచ్ జూపాక రాజేశ్వరి, ఎంపీటీసీ సోగాల సుజాత-కిష్టయ్య, బుద్దిపల్లి గ్రామ సర్పంచ్ అన్నం మధుసుదన్రెడ్డితో పాటు మిష న్ భగీరథ, గ్రిడ్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.