ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో వరి ధాన్యం దండిగా పండింది. మొత్తం 508 కేంద్రాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టగా, ఇటీవలే ప్రక్రియ ముగిసింది. గత సీజన్కంటే లెక్కకు మించి దిగుబడి వచ్చింది. సర్కారు రికార్డు స్థాయిలో 3.71 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.412.47 కోట్లు జమ చేయగా, మిగతా చెల్లింపులు వారం పది రోజుల్లో పూర్తి చేసే అవకాశమున్నది. ఇక అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు తడిసిన వడ్లను సైతం మద్దతు ధరతో కొని అన్నదాతలకు అండగా నిలువగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖాతాల్లో జమ అయిన డబ్బులు(కోట్లలో)
అమ్మినంక వారానికే డబ్బులు పడ్డయి
దండేపల్లి, జూన్23 : నా పేరు బర్పటి సత్తయ్య. మాది దండేపల్లి మండలం చింతపెల్లి గ్రామం. మా ఊరి శివారులో 3 ఎకరాల భూమి ఉంది. అందులో వరి వేసిన. పంట కోసి సర్కారోళ్లు పెట్టిన కొనుగోలు కేంద్రానికి తీసుకపోయిన. కాంటా వేసిన్రు. 73 క్వింటాళ్లు అయినయ్. అమ్మినంక వారానికే రూ. లక్షన్నర పడ్డయి. కేంద్రమోళ్లు రైతులను పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ సార్ మమ్ముల కడుపుల పెట్టుకొని చూసుకుంటున్నడు. వానలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇచ్చిండు. తడిసిన వడ్లను కూడా కొన్నడు. గిసొంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మాకు రంది లేదు.
మంచిర్యాల, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం ఈ యాసంగిలో 3.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లాలో 210, మంచిర్యాల జిల్లాలో 262, ఆదిలాబాద్ జిల్లాలో 3, ఆసిఫాబాద్ జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ చేయడం సైతం పూర్తి కావొచ్చింది. కేవలం రెండు నెలల్లోనే పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ధాన్యం విక్రయించి వారం తిరగకుండానే ఖాతాల్లో డబ్బులు సైతం వేసిందని రైతులు సంబురపడిపోతున్నారు. పంటకు పెట్టుబడి సాయం అందజేసి, అకాల వర్షాలకు నష్టపోయిన పంటకు పరిహారం ఇచ్చి, చివరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి కేసీఆర్ సర్కారు తమను ఆదుకుందని చెబుతున్నారు.
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రికార్డు..
ఉమ్మడి జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేసే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలు ధాన్యం కొనుగోళ్లలో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాయి. గతేడాది యాసంగిలో మంచిర్యాల జిల్లాలో 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సీజన్లో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. పోయిన వర్షాకాల సీజన్ 1.58 లక్షల మెట్రిక్ టన్నులకంటే కూడా ఈ సీజన్లోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. గతేడాది యాసంగిలో 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సీజన్లో 1.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పోయిన వర్షాకాలం సీజన్ 1.37 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ సీజన్లోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది యాసంగిలో 14216.84 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సారి 24,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. గత వర్షాకాలం 21409.72 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ జిల్లాలోనూ ఈ సారే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయి. ఇక వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తూ, తక్కువ వరిసాగు చేసే ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 65.2 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు.
రైతుల ఖాతాల్లోకి డబ్బులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే రూ. 412.47 కోట్లు రై తుల ఖాతాల్లో జమ అయ్యాయి. మొత్తంగా 80శాతం డ బ్బులు ఇప్పటికే రైతులకు అందాయి. మంచిర్యాల జిల్లాలో రూ.352 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ.214.43 కోట్లు ఇప్పటికే రైతులకు చేరాయి. నిర్మల్లో రూ.160.37 కోట్లు రైతుల ఖాతాల్లో పడగా, మరో రూ.80 కోట్లు పడాల్సి ఉంది. ఈ వారం, పది రోజుల్లో మిగిలిన చెల్లింపులు పూర్తవుతాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించామని, ఎక్కడా ఇబ్బందులు పడకుండా విజయవంతంగా కొనుగోళ్లకు పూర్తి చేశామని చెప్పారు.
వడ్ల పైసలు పడ్డయ్..
సోన్, జూన్ 23 : మొన్న యాసంగిలో నాలుగెకరాల్లో వరి చేసిన. మాకు మా ఊరి శివారులో ఎకరం 12 గుంటల భూమి ఉంది. మిగతాది కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన. కోత కోసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన. మొత్తం 68 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నా ఖాతాల్లో రూ. లక్షా 40 వేలు పడ్డయి.
– వెంకట్రావ్, రైతు, సాకెర