బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 4: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల్లో 5918 మంది విద్యార్థులకు గానూ 5774 మంది హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలోని మూడు పరీక్షా కేంద్రాలను రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి పర్యవేక్షించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. 95 శాతం హాజరు నమోదైనట్లు ఆర్సీవో కే స్వరూపారాణి తెలిపారు. బెల్లంపల్లిలోని బాలుర,బాలికల, కాసిపేట పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చీఫ్ సూపరింటెండెంట్లు ఐనాల సైదులు, స్వరూప, ఊటూరి సంతోష్కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు. తాళ్లగురిజాల ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ అధికారులుగా కాసారపు శ్రీధర్, బూర రమేశ్ బాబు,కుమ్మరి మోహన్, రూట్ ఆఫీసర్లుగా దశరథం, ఆనందరెడ్డి వ్యవహరించారు.