సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు మరో వరంలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి.. వారితో కలిసి అల్పాహారం ఆరగించారు. నాలుగు జిల్లాల్లో 2,67,768 మందికి ప్రయోజనం చేకూరనుండగా, పిల్లలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేను వడ్డాడి నుంచి రోజూ పాఠశాలకు వస్తాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే నాలాంటి వారు పొద్దున సమయానికి పాఠశాలకు రావాలంటే తినకుండా వచ్చుడే అయితది. ఇప్పుడు ఈ అల్పాహార పథకంతో ఇక్కడే మా కడుపు నిండుతది. పొద్దున తినిరాకుంటే, ఆకలితో చదువులంటే ఇబ్బందైతది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నాలాంటి పిల్లలకు మేలు చేసేలా మంచి పనిజేసిండ్రు మధ్యాహ్నం అన్నం కూడా ఇక్కడే తింటున్నం. ఇప్పటికే మాకు పుస్తకాలు, యూనిఫాం ఫ్రీగా ఇస్తున్నరు. పెద్ద పెద్ద స్కూళ్లలో ఉన్నట్లే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నరు. ఇగ మేం మంచిగ చదువుకునేందుకు ఇంతకన్న ఏం కావాలె. కేసీఆర్ సారుకు థ్యాంక్స్.
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించగా, అనూహ్య స్పందన వచ్చింది. విద్యార్థులకు అల్పాహారం వడ్డించడంతో పాటు వారితో కలిసి ఆరగించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్ బదావత్ సంతోష్, బెల్లంపల్లిలో అదనపు కలెక్టర్ రాహుల్, మంచిర్యాలలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మోతీలాల్ ప్రారంభించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని జడ్పీఎస్ఎస్ గర్ల్స్లో కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్నగర్ జడ్పీఎస్ఎస్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, నిర్మల్ జిల్లా సోన్లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముథోల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆదిలాబాద్లో కలెక్టర్ రాహుల్ రాజ్, బోథ్లో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తాలు ప్రారంభించారు.
ఈ పథకం అమల్లోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3,637 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,56,204 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. 18 ఎయిడెడ్, 14 మోడల్ స్కూల్స్లో 11,472 మందితో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని 5 మదర్సాల్లోని 92 మంది విద్యార్థులకు సైతం బ్రేక్ఫాస్ట్ అందనుంది. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పాఠశాలల్లో కలుపుకొని 1,26,977 మంది, నిర్మల్ జిల్లాలో 51,543 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 44,062 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 45,186 మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం అందించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కడుపు నింపి వారి మేథస్సు చురుకుగా పని చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రతిరోజు మధ్యాహ్నం సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తుంది. దానికితోడు రాగిజావ, కోడిగుడ్డు, అరటిపండ్లను అందజేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్తో మరింత పౌష్టికాహారం అందనుంది. విద్యార్థులకు నాణ్యమైన, పుష్టికరమైన భోజనం అందనుండగా, వారి శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే బడి పిల్లల హాజరును మెరుగుపర్చడంతో పాటు డ్రాపౌట్స్ను తగ్గించేందుకు ఈ పథకం దోహదపడనున్నడి. విద్యార్థులు పాఠశాలకు ఆకలితో వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించగా, ఈ పథకంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా బడిలో ప్రైవేటుకు మించి సౌకర్యాలున్నాయి. పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. మధ్యాహ్నం కడుపునిండా భోజనం కూడా పెడుతున్నరు. కొత్తగా టిఫిన్ కూడా స్టార్ట్ చేసిన్రు. ఇక రోజూ పెడుతరట. ఆకలితో ఉంటే చదువు మనసున పట్టదు. ఇక రోజూ పొద్దుగాల బడికి వచ్చి.. టిఫిన్ చేస్త. మంచిగ చదువుకుంటం.
-చెల్పూరి కీర్తన, మందమర్రి
మా స్కూల్లో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ స్టార్ చేశారు. ప్రతిరోజూ ఇంట్లో ఉదయం టిఫిన్ చేయడం కుదరదు. తొందరగా రెడీ అయ్యి బడికి పోతం. కాబట్టి మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండాల్సి వస్తది. ఇక నుంచి మాకు ప్రతి రోజూ మా స్కూల్లో టిఫిన్ పెడుతరట. ఈ రోజు తిన్న. మంచిగుంది. మా బాధను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ సార్కు థాంక్స్.
– కస్తూరి అశ్విన్, మందమర్రి
భైంసాటౌన్, అక్టోబర్ 6: నా బిడ్డ శ్రద్ధ దేగాం సర్కారు బడిలో ఆరో తరగతి చదువుతున్నది. ఉదయం ఇంట్ల టిఫిన్ చేసుడంటే కొంత కష్టమే. మేం పొద్దు గాల్నే పొలం పనికి పోవు డు ఉంటది. తను కూడా పొద్దున్నే స్కూల్కు పోతది. ఆకలికి ఇబ్బంది పడుత దని పెద్ద రంది అయితుండే. ఇప్పుడు స్కూళ్లనే టిఫిన్ పెడుతమని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకు నుడు మంచిగున్నది. మధ్యాహ్నభోజనం కూడా పెడుతున్నరు. స్కూల్ పుస్తకాలు, డ్రెస్సులు, భోజ నం అంతా ఇప్పటిదాకా ప్రభుత్వమే చూసుకుం టున్నది. ఇప్పుడు టిఫిన్ కూడా పెడుతున్నది. కేసీఆర్ సారు ఉన్నడు కాబట్టే ఇంత మంచి నిర్ణయం వచ్చింది.
-మారుతి, దేగాం
భైంసాటౌన్, అక్టోబర్ 6: మా పాఠశాలలో శుక్రవారం సంది టిఫిన్ పెట్టుడు షురూ జేసిన్రు. కమ్మని టిఫిన్ పెట్టిన్రు. ఇంట్లో తిన్నట్లే ఉంది. మా ఎమ్మెల్యే సారు వచ్చి అందరికీ టిఫిన్ వడ్డించిండ్రు. ఈ రోజు మాకు ఉప్మా పెట్టిన్రు. ఇక నుంచి రోజూ బడికి రావొచ్చు. ఆకలికి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే మాకు రాగిజావ, మధ్యాహ్న భోజనం పెడుతున్నరు. పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా ఇస్తున్నరు. ఇప్పుడు మంచిగ టిఫిన్ కూడా మొదలుపెట్టిన్రు. అందుకే నాకు సీఎం కేసీఆర్ అంటే ఇష్టం.
-నందిని , 8వ తరగతి, దేగాం
నేను ఉదయం ఇంటి నుంచి తినకుండానే వచ్చేదాన్ని. ఒక్కోసారి మస్తు ఆకలయ్యేది. ఇప్పుడు సీఎం అల్పాహారంతో బడిలనే టిఫిన్ చేయొచ్చు. ఇంట్లో అంత పొద్దున్నే టిఫిన్ చేయాలన్నా ఇబ్బందే. ముఖ్యమంత్రి అల్పాహారం పథకంతో ఇప్పుడు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు థ్యాంక్స్.
– సలోని, తొమ్మిదో తరగతి
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 6 : మార్నింగ్ ఇంట్లో అన్నం వండకున్నా, టిఫిన్ లేకున్నా స్కూలుకు డుమ్మా కొట్టేది. సార్లు సెప్పిన్రు ఇక నుంచి రోజుకో టిఫిన్ ఉంటదట. ఇగ ప్రతి రోజూ స్కూలుకు వస్త. ఇంటికాడకన్నా స్కూలుకు వస్తే అటు చదువు, ఇటు మధ్యాహ్నం లంచ్తో పాటు పొద్దున టిఫిన్ కూడా చేయవచ్చు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు థాంక్యూ..
– పీ. గీతిక్, నాలుగవ తరగతి, గర్మిళ్ల స్కూల్, మంచిర్యాల
సోన్, అక్టోబర్ 6: ప్రతిరోజూ ఉద యం పూట పిల్లలకు టిఫిన్ అందించడం మంచి ఆలోచన. పిల్లలు స్కూల్కు రెడీ అవడం లేటవుతుందని ఇంట్లో ఒక్కో సారి ఏం తినకుండా వస్తున్నరు. గిట్లయితే వాళ్ల ఆకలి గురించి మాకు పెద్ద రంది ఉంటుండే. ఇప్పడిక మాకు ఆ బెంగ లేకుండా పోయింది. పిల్లలకు ఉచిత చదువుతో పాటు బట్టలు, పుస్తకాలు అన్ని సర్కారే ఇస్తున్నది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే పెడుతున్నరు. ఇప్పుడు పొద్దున పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేయ డం ఎంతో సంతోషంగా ఉంది. పేదింటి బిడ్డలు ఆకలి తో ఇబ్బంది పడొద్దని సర్కారు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం బాగుంది.
-అక్రం లక్ష్మి, విద్యార్థి తల్లి, సోన్
మాకు పొద్దున్నే బళ్లో ఉప్మా, చట్నీతో టిఫిన్ పెట్టిండ్రు. రోజూ ఇంటికాడ అన్నం తిని వచ్చేదాన్ని. పొద్దున్నే అమ్మ మాకోసం వంట చేసి, తినిపించి బడికి పంపేది. ఇప్పుడు బడిలోనే టిఫిన్ పెట్టడం మా అదృష్టం. ఇక ఒక్కో రోజు అన్నం కాకపోయినా బడిలో తింటారని నమ్మకం ఇంట్లో వాళ్లకు ఉంటది. ఇయ్యాల మంచిగ మంత్రి, కలెక్టర్ సార్లతో కలిసి టిఫిన్ తిన్న. టిఫిన్ ఎంతో రుచిగా ఉంది. రోజూ పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంచిగ చదువుకుంట.
-పల్లికొండ శ్రీనిధి, విద్యార్థిని, ఐదో తరగతి