ఆదిలాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.30 గంటలకు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్కు చేరుకుంటారు. 1.45 నుంచి 2.15 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించి, గోపురంతోపాటు ఇతర పనులను ప్రారంభిస్తారు.
2.15 నుంచి 3.15 గంటల వరకు దర్బార్ హాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మహిళా సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇంద్రవెల్లికి బయలుదేరి 3.30 నుంచి 3.50 గంటల వరకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3.50 నుంచి 4.50 గంటల వరకు ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.55 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం అవుతారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇంద్రవెల్లిలో బహిరంగ సభ జరుగుతుండగా.. ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నాయకులు భారీ జన స మీకరణ చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీ తక్క, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా పర్యటి స్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరు మంత్రులు, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేస్లాపూర్తోపాటు ఇంద్రవెల్లిలో హెలిప్యాడ్ను నిర్మించారు.