ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, బీఆర్ఎస్తోనే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పాలనలో భూములు ఎవరి పేరిట మారుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, తమకు తెలియకుండానే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవని మండిపడుతున్నారు.
పట్వారీ వ్యవస్థను తిరిగి అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని హస్తం పార్టీ నాయకులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతామంటున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటల నమ్మే పరిస్థితి లేదని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
అదే సీఎం కేసీఆర్ భూముల వివరాలను సరిచేసి ధరణిపోర్టల్లో పకడ్బందీగా పొందుపర్చారని, రైతులు తమ భూ రికార్డులను సెల్ఫోన్ సాయంతో అరచేతిలో చూసుకునే అవకాశం కలిగిందంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పదేళ్లుగా సంతోషంగా ఉన్నామని, ధరణిపోర్టల్ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని వారంతా స్పష్టం చేస్తున్నారు.
– మంచిర్యాల, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాసిపేట, నవంబర్ 27 : తెలంగాణలో ధరణితో భూ సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. గతంలో సరైన భూముల వివరాలు సక్రమంగా లేక అనేక ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు ఎలాంటి దళారీ వ్యవస్థ లేదు. ధరణి రద్దు చేసి పాత రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తరట. అంతకంటే దరిద్రం ఏముంటుంది ఇగ. మళ్లా లంచాలు ఇచ్చుకుంట. మళ్లా ఆఫీసుల చుట్టూ తిరుగాలా? కాంగ్రెసోళ్ల ముచ్చట ఎత్తుడే వద్దు.
– కడారి తిరుపతి, కాసిపేట
దండేపల్లి, నవంబర్27: భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇష్టం వచ్చినట్లు చేయాలని కాంగ్రేసోల్లు చూస్తున్నరు. కేసీఆర్ వచ్చినంక ఎక్కడ భూముల పంచాయతీ లేదు. పైరవీకారుల అవసరం లేదు. భూముల లొల్లులతో కుటుంబాలు విడిపోవడవం లేదు. ఇవన్నీ సరిదిద్దడానికి సీఎం సారు ధరణి తీసుకువచ్చిండు. కాంగ్రెస్ నాయకులు రాగానే ధరణి తీసేస్తాం అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న రైతుల కుటుంబాల్లో మళ్లీ గొడవలు కావాలని చూస్తారా.. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారులు పుట్టుకొచ్చి రైతుల రక్తం తాగుతరు. మళ్లా కేసీఆర్ రావాలే. ఇప్పుడున్న రైతుల పథకాలు అన్ని ఉండాలే. రైతులందరూ సీఎం సారుకు అండగా ఉండాలే.
-మన్నే రాజలింగు, రైతు, నంబాల
దండేపల్లి, నవంబర్ 27 : ఎన్నికల ముందు 3 గంటల కరెంటు అంటూ మోసం చేయడానికి వస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నరు. మూడు గంటల కరెంట్ అంటే రైతులు ఆగం కావడం ఖాయం. మూడు గంటల కరెంటుతో ఒక్క మూల కూడా తడువదు. గతంలో వచ్చీరాని కరెంటుతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.10 హెచ్పీ మోటర్లు అంటున్నరు. దాని ఖర్చు ఎవ్వరూ భరించాలే. 10 హెచ్పీ మోటర్లు బిగిస్తే బోర్లలో ఊట తగ్గుతది. మోటర్లు మోతాదుల పోస్తేనే వచ్చే ఊటను చాలా సమయం వరకు నీరు వచ్చి పాలం పారుతది. కూరగాయల పంట సాగు చేస్తుంటాం. 5 హెచ్పీ మోటర్ సరిపోతుంది.
-ఉప్పులపాటి కిషోర్, తానిమడుగు.
రైతుల భూములు భద్రంగా ఉండాలని కేసీఆర్ సరారు ధరణి తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి తీసేసి పాత పద్ధతిని కొనసాగిస్తదట. ఇది దుర్మార్గపు చర్య. రైతుల భూములకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పూర్తి భద్రత కల్పిస్తే, వాటిని రద్దు చేస్తే మళ్లీ అరిగోస తప్పదు. ధరణి రద్దు చేస్తే దరిద్రం చుట్టుకున్నట్టే. ధరణి రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డం. అవన్నీ ఇప్పటికీ మర్చిపోతలేం. పట్వారీ, వీఆర్వోలు ఒకరి భూమి ఒకరి పేర రాసి కోట్లు గడించింన్రు.
ఎకరం భూమి పట్టా కావాలంటే ఏళ్లు పట్టేది. భూముల గొడవలు ప్రతి గ్రామంలో ఎన్నో జరిగేవి. రైతుల బాధలు చూసిన కేసీఆర్ ధరణి తెచ్చిండు. ఇప్పుడు ఏ రందీ లేదు. రిజిస్ట్రేషన్ చేయాలంటే క్షణాల్లో పని అయిపోతుంది. నిమిషాల్లో పట్టామారి, వెంటనే హకు పత్రం ఇస్తున్నారు. ఎవ్వరినీ ప్రాధేయ పడకుండా తహసీల్ కార్యాలయంలోనే ఈ పనులన్నీ అయిపోతున్నయ్. గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. అప్పుడయితే ఏండ్లు పట్టేది. ధరణి పెట్టిన బీఆర్ఎస్కే మా మద్దతు. ధరణి రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్కు ఓటు ద్వారా బుద్ధి చెప్తాం.
– నందిపేట ఇస్తారి, బోయపల్లి
తాండూర్, నవంబర్ 27 : ధరణి తెచ్చిన తర్వాత రైతులకు మరింత ధైర్యం లభించింది. అన్నింటికీ పరిషారం దొరికింది. భూములకు భద్రత ఉన్నది. గతంలో రిజిస్ట్రేషన్ కావాలంటే ఆసిఫాబాద్, మంచిర్యాలకు పోయేటోళ్లం. పొద్దున పోతే వచ్చే వరకు రాత్రి అయ్యేది. ఇప్పుడు మండలాఫీసులోనే రిజిస్ట్రేషన్ అయిపోతున్నది.
వెంటనే పట్టా బుకు చేతికి ఇస్తున్నరు. ధరణిని తీసేస్తే మళ్లీ దోపిడీకి గురవుతాం. పటేల్, పట్వారీ వ్యవస్థ మళ్లీ రాజ్యమేలుతున్నది. ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీదకి సులువుగా మారి పోతుంది. రైతులను ముప్పు తిప్పలు పెడుతరు. భూ సమస్యలపై అధికారులను కలిస్తే వేలకు వేలు ముడుపులు తీసుకునేటోళ్లు. పనిమాత్రం నెలల తరబడి తిరిగిన చెయ్యకపోదురు. సీఎం కేసీఆర్ సార్ రైతుల కోసం ధరణి పోర్టల్ తెచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే మళ్లీ ఎన్నుకుందాం.
-అన్నమనేని సుధాకర్రావు, రైతు, తాండూర్
నెన్నెల, నవంబర్ 27 : ధరణితోనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఏదో మా భూమి.. మీ భూమి అంటూ చేప్పే వారిని నమ్మేటట్లు లేదు. మోసం చేసేవారు ఏదో చెప్పి కాలం వెళ్లదీస్తరు తప్పా రైతుల గోస పట్టించు కోరు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను అసలే నమ్మే పరిస్థితి లేదు. రైతులు పడుతున్న తిప్పలు వాళ్లకేం తెలుసు. కాంగ్రెస్ కాలంలో ఎంత గోసపడ్డమో గా నాయకులకు తెల్వదా.
ధరణి తీసివేస్తే రైతుల బతుకు లు ఆగమవుతయి.. గాళ్ల మాటలు ఎవరూ నమ్మరు. గా ప్రభుత్వం ఉన్నప్పుడు గట్లనే పట్వారీలతో నానా గోస పడ్డం. భూమి పట్టా చేసుకోవాలన్నా.. పహణీలో పేరు మారాలన్న పైసలిస్తేనే పనయ్యేది. ఇప్పుడు మళ్లీ గట్లనే చేయాలని కుట్ర చేస్తున్నరు. ధరణిలాంటి పోర్టల్ పెట్టి మంచి చేసినోడు ఎక్కడున్నడో కాంగ్రెసోళ్లు చూపెట్టాలి.
– మానపెల్లి మధనయ్య, రైతు, ఖర్జీ