ప్రగతి ప్రదాత, సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. నిర్మల్ జిల్లావాసులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి అశేష జనవాహిని తరలిరావడంతో నిర్మల్ జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది ఆర్టీసీ బస్సులు, వేలాది ప్రైవేట్ వాహనాల్లో రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. మహిళలు, రైతులు గులాబీ కండువాలు కప్పుకొని తండోపతండాలుగా రావడంతో జాతరను తలపించింది. ఎటూ చూసినా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. నలువైపులా కిలో మీటర్ల మేర రహదారులపై జనం కనిపించారు. జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్ నినాదాలు మార్మోగాయి. కాగా.. సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయం, మైనార్టీ గురుకుల కాలేజీ కాంప్లెక్స్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదికపై లక్షలాది మంది సభికుల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన జనసంద్రాన్ని చూసి వరాల జల్లు కురిపించారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, జూన్ 4(నమస్తే తెలంగాణ)
నిర్మల్ టౌన్/నిర్మల్ అర్బన్/సోన్ జూన్ 4: నిర్మల్ జిల్లా పర్యటనకు తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించి కొత్త కలెక్టరేట్లను ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు మెడికల్ కళాశాలలను మం జూరు చేశామని, వచ్చే ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తానని హా మీనిచ్చారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ఒక్కో జీపీకి రూ. 10లక్షల చొప్పున మొత్తం రూ. 39.60కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మొత్తం రూ. 75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 19 మండలాలకు ఒక్కో మండలానికి రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 3.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, రాష్ట్ర మంత్రితో పాటు, విద్యాధికారులు, ఉపాధ్యాయుల కృషి ఫలితమేనని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతీ నిలయమైన బాసర ఆలయ పునరుద్ధరణ పనులను యదాద్రి తరహాలోనే చేపడుతామని, త్వరలో స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని వెల్లడించారు. జిల్లాలో 27, 28 ప్యాకేజీ పనులను పూర్తి చేసి వచ్చే ఏడాదిలోపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇలా నిర్మల్ జిల్లాలో 196 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు త్వరలో పట్టాలు ఇచ్చి, వచ్చే సీజన్ నుంచే రైతు బంధు అందజేస్తామని ప్రకటించారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మమ్మల్ని ఆశీర్వాదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తరువాత మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. జిల్లాలో 3200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించడం సంతోషంగా ఉందన్నారు.
సభ సక్సెస్తో బీఆర్ఎస్ నేతల్లో మరింత జోష్…
నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనం నుంచి విశేష స్పందన లభించడంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నింపింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక కృషితో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయగా జిల్లా నలుమూలాల నుంచి లక్షలాది మంది జనాలతో పాటు పార్టీ కార్యకర్తలు,నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, బాపురావ్, జోగు రామన్న, ఆత్రం సక్కు, బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, కోవ లక్ష్మి, జనార్దన్ రాథోడ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ దండె విఠల్, గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎంపీ నగేశ్, రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వీ.సత్యనారాయణగౌడ్, అల్లోల కుటుంబసభ్యులు మురళీధర్రెడ్డి, సతీమణి విజయలక్ష్మి, యువ నాయకులు గౌతంరెడ్డి దివ్యారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్కుమార్, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏర్పాట్లలో అల్లోల కుటుంబసభ్యులు బిజీ..
సీఎం కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేసేందుకు మంత్రి అల్లోల కుటుంబ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు. అల్లోల కుమారుడు గౌతంరెడ్డితో పాటు, సోదరుడు మురళీధర్రెడ్డి, సురేందర్రెడ్డి అన్ని సౌకర్యాలు కల్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లా పర్యటనకు రాగా, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజానీకం ఘన స్వాగతం పలికింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షకు పైగా తరలిరాగా, పట్టణం కిక్కిరిసిపోయింది. జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో ఊరూ.. వాడా.. గులాబీమయమైంది. సీఎం సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయం, మైనార్టీ గురుకుల కాలేజీ కాంప్లెక్స్కు ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, పండుగ వాతావరణం కనిపించింది. సభా వేదికపై అధినేత వరాలు కురిపించగా, సభికుల కరతాళ ధ్వనులు, జై కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రగతి ప్రదాత ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, జూన్ 4(నమస్తే తెలంగాణ)
సంక్షేమ సారథి సల్లంగుండాలె
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు ఏర్పాటు చేసి పిలగాండ్లకు కడుపునిండా బువ్వ పెట్టి.. మంచిగ సదువు చెప్పిస్తున్నడు. గిట్లా పేదోళ్ల కోసం అనేక మంచి పనులు చేస్తున్నడు. గిసొంటి సీఎం ఉన్నంత కాలం మాలాంటోళ్లకు ఢోకా లేదు. ఆయన సల్లంగుండాలె’ ’ అని ప్రజలు ముఖ్యమంత్రికి దీవెనలు అందించారు. ఆదివారం నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సందర్భంగా పలువురిని పలకరించగా, వారు బీఆర్ఎస్ సర్కారు పనితీరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముగ్గురు బిడ్డలకు కల్యాణ లక్ష్మి వచ్చింది..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : సీఎం కేసీఆర్ సారు తెచ్చిన కల్యాణ లక్ష్మి నా ముగ్గురు పిల్లలకు వచ్చింది. నాకు నలుగురు బిడ్డలు. నాలుగేళ్ల క్రితం పెద్ద బిడ్డకు పెండ్లి చేసిన. మూడేండ్ల కింద రెండో బిడ్డకు, రెండేండ్ల కింద మూడో బిడ్డకు పెండ్లి జేసిన. ముగ్గురికీ కల్యాణ లక్ష్మి పథకం కింద సాయం అందింది. ఆడబిడ్డలంటే భారం కాకుండా సీఎం కేసీఆర్ సారు పెట్టిన పథకం మాలాంటి వారికి అండగా నిలిచింది. మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే గెలవాలి.
– నారుపాక రాజవ్వ, దస్తూరాబాద్
తండాలు పంచాయతీలయ్యాయి..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చిన్రు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసి చూపిస్తున్నది. గిరిజనులకు విద్య అందించాలనే ఉద్దేశంతో గిరిజన వసతి గృహాలు ఏర్పాటు చేసి కడుపునిండా బువ్వపెట్టి సదువు చెప్పిస్తున్నది. తండాలకు తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నది.
– ఆడె జానూబాయి, సిరిపెల్లి తండా
పేదల పక్షపాతి కేసీఆర్..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ సార్. ఆయన చేపడుతున్న పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నయ్. నాకు నెలనెలా వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. అది నాకు ఆసరాగా ఉంది. నాకు రెండెకరాల భూమి కూడా ఉంది. రైతుబంధు ద్వారా నాకు వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి, రైతు సంక్షేమానికి పాటుపడుతున్నరు. ఇలాంటి పథకాలు ఎన్నో ఆయన అమలు చేస్తున్నరు.
– ఎమ్లా, మార్లగొండ
60 కిలోమీటర్ల నుంచి వచ్చిన..
నిర్మల్ చైన్గేట్, జూన్, 4 : సీఎం కేసీఆర్ సారు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నరు. నాకు నెల నెలా రూ.3016 దివ్యాంగుల పింఛన్ వస్తున్నది. వాటితోనే అవసరాలు తీరుతున్నయ్. కేసీఆర్ సారు నిర్మల్ సభకు వస్తున్నాడని ఆయనను చూసేందుకు 60 కిలోమీటర్ల నుంచి వచ్చిన. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నడు. గత ప్రభుత్వాలు చేయని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడు.
– గంగామణి, ముథోల్
పెద్దకొడుకులా అండగా ఉన్నడు..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉన్నడు. గతంలో ఎన్నడూ చూడని పథకాలు అమలుచేస్తున్నడు. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛను అంతంత మాత్రంగా ఉండేది. నాకు ఐదుగురు బిడ్డలు, ఒక కొడుకు. ప్రతి నెలా వచ్చే పింఛన్ నాకు ఆసరాగా ఉంది. మా లాంటి ముసలోళ్లకు ఆయన అండగా నిలిచిండు. సారు జిల్లాకు వస్తున్నాడని తెలిసి చూసేందుకు వచ్చిన.
– అంజని బాయి, ముథోల్
గిరిజనులకు రిజర్వేషన్లు..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇచ్చిన మాటను నిలుపుకున్నరు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చి నెరవేర్చిన్రు. 12 శాతం రిజర్వేషన్ కల్పించిన్రు. దీంతో మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతయ్. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆయనను ఆశీర్వదించేందుకు నిర్మల్ వచ్చిన. రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కింది. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తా అన్నరు.
– అరుణాబాయి, సిరిపెల్లి తండా
సారును చూసేందుకు వచ్చా..
నిర్మల్ చైన్గేట్, జూన్ 4 : అందరి బాగోగులు చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ సారును చూసేందుకు వచ్చిన. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నడు. అందరి సంక్షేమాన్ని కోరే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు దేవుడు. ఆయన నిర్మల్ వస్తున్నాడని తెలిసి 60 కిలోమీటర్ల నుంచి వచ్చిన. మా సంక్షేమం కొరే ఆయననే మళ్లీ అధికారంలోకి రావాలని ఆశీర్వదించేందుకు వచ్చిన. చాలా సంతోషమనిపించింది.
– శ్రీనివాస్గౌడ్, మాలేగాం