మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అభినందించారు. పేదింట పుట్టి వైద్య విద్య అభ్యసించాలనుకునే పిల్లలు ప్రభుత్వ వైద్య కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. మంచిర్యాలవాసులకు మెడికల్ కళాశాల వరం వంటిది. ప్రతిభ ఉండి మెడిసిన్ చదువాలనుకునే వారికి చాలా ప్రయోజనం. మన జిల్లావాసులతోపాటు ఆసిఫాబాద్, మహారాష్ట్ర వాసులకు కూడా మెరుగైన వైద్యం అందుతుందన్నారు.
మంచిర్యాల, నవంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల మంగళవారం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ స్వయం గా హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మెడికల్ కాలేజీని ప్రారంభించడంతో ప్రజల ఆనందం రెట్టింపు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది కాలేజీలను ప్రారంభించిన కేసీఆర్ అనుమతులు వచ్చిన ఏడాదిలోనే కాలేజీలను అందుబాటులోకి తెచ్చిన ఆయా జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పే దింట పుట్టి వైద్య విద్య అభ్యసించాలనుకునే పిల్లలు ప్రభుత్వ వైద్య కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఈ రోజు మంచిర్యాలకు చారిత్రాత్మకమైన రోజు. తెలంగాణలో మారుమూల ప్రాంతమైన మంచిర్యాలకు ఒక మెడికల్ కాలేజీని తీసుకురావడం గొప్ప విషయం.
ఉమ్మడి జిల్లాలో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టేంది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారింది. మన జిల్లావాసులతోపాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని సిరోంచా నుంచి నిరుపేదలు మెరుగైన వైద్యం కోసం మన వద్దకు వస్తున్నారు. అలాంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీ రావడంతో పేదలకు మంచి వైద్య సేవలు అందడమే కాకుండా, ప్రతిభ ఉండి మెడిసిన్ చదువు కోవాలనుకునే పిల్లలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించుకున్న ఎనిమిది కళాశాలల్లో మనది ఒకటి అవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజ య్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, న స్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమి టీ చైర్మన్ భూమేశ్, నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆశయం నెరవేరాలి..
మంచిర్యాలలో వైద్యరంగం మెరుగుపడాలని మన ముందు ఉన్న పెద్దలు చాలా కష్టపడ్డారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు మనం మెడికల్ కాలేజీని సాధించుకున్నాం. వైద్య విద్య చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశయంఈ మెడికల్ కాలేజీ ద్వారా నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల.
అందరి కృషితోనే సాధ్యమైంది..
మంచిర్యాల వైద్య కళాశాలకు అనుమతి వస్తుందో? లే దో? అనుకున్నా. ఫిబ్రవరిలో తొలిసారి ఇన్స్పెక్షన్ అ యింది. అలా జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో జరిగిన ఇన్స్పెక్షన్లలో అనుమతి ఇవ్వమన్నారు. కలెక్టర్ మొదలుకొని కాలేజీలో అటెండర్ వరకు అందరూ కాలేజీ కావాలని తన వంతు ప్రయత్నం చేశా రు. చివరకు అక్టోబర్లో ఓకే అయ్యింది. ఇందులో అందరి కృషి ఉంది. అందుకే ఈ మెడికల్ కాలేజీ ఏ ఒ క్కరిదో కాదు. అందరిది. పర్మిషన్ వచ్చేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.
– దావుద్ సులేమాన్, ప్రిన్సిపాల్
ఆనందంగా ఉంది..
మంచిర్యాల మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచిర్యాలకు కాలేజీ మంజూరు చేస్తూ ప్రకటన వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాదిలో కలెక్టర్, వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మా టీమ్ చాలా కష్టపడ్డాం. దానికి ఈ రోజు ఫలితం లభించింది. మంచిర్యాల జిల్లాలో వైద్యసేవలు, వైద్య విద్య శిక్షణ మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
– అరవింద్, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి ఆస్పత్రుల సూపరింటెండెంట్
కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
మంచిర్యాలటౌన్, నవంబర్ 15: రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఎనిమిది మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎన్నోఏళ్లుగా ఎదురుచూసిన మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు వైద్య కళాశాలను ఏర్పాటు చేసి, తరగతులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ ప్రారంభం సంతోషం : విప్ బాల్క సుమన్
చెన్నూర్ రూరల్, నవంబర్ 15: మంచిర్యాల జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజ్ ప్రారంభించడంపై ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయమని విప్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 57 ఏండ్లలో మూడు కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో 8 ఏళ్లలో 12 కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి ప్రాధాన్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.