చాందా(టీ)లో ఆత్మీయ సమ్మేళనానికి హాజరు దేశంలో ప్రజల సంక్షేమాన్ని పట్టకుండా కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పబ్బం గడుపుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. నియోజకవర్గంలోని చాందా (టీ)లో బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాన్ని గురువారం నిర్వహించారు. ప్రజలను విభజించే పాలన బీజేపీదని, కలిపే పాలన బీఆర్ఎస్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం
దేశానికి సమర్థ నాయకత్వం అవసరమని, అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సమగ్ర అభ్యున్నతే తమ పార్టీ నినాదమని, రానున్న ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పి, గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
-ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 20
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ) గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన అతిథులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమ్మేళనంలో భాగంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మతాల పేరిట చిచ్చు పెట్టి, విభజన పాలనకు బీజేపీ తెరతీసిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలననందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతానికి దేశానికి సమర్థ నాయకత్వం అవసరమని, అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ
పథకాల తీరును ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, సర్పంచ్ దారట్ల భాస్కర్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, జిట్టా రమేశ్ రాజు పాల్గొన్నారు.