ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,27,129 ఎకరాల భూమిని 66,004 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్నామని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమకు పట్టాల పంపిణీ చేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పాలిగన్ టెక్నాలజీతో పట్టాలు అందిస్తుండడంతో భవిష్యత్లో వివాదాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
– ఆదిలాబాద్, మే 3(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు త్వరలో పట్టాలు అందనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నూతనంగా నిర్మించిన అంబేద్కర్ సచివాలయం ప్రారంభం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీభూములు సాగు చేస్తున్న రైతుల్లో సంతోషం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతర రైతుల నుంచి గతేడాది నవంబర్లో అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. అటవీ హక్కు పత్రాల పంపిణీలో భాగంగా గ్రామాల్లో అటవీశాఖ బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు పర్యటించి ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమక్షంలో దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే విషయంలో అవగాహన కల్పించారు. సంబంధిత పత్రాలతో క్లెయిమ్స్ స్వీకరించారు.
66 వేల దరఖాస్తులు అందజేత..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 38 మండలాల పరిధిలో 248 పంచాయతీల్లోని 711 గ్రామాల్లో గిరిజనులు, ఇతర రైతులు పోడు భూములను సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 66,004 మంది రైతులు పోడు భూముల్లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లో 2,27,129 ఎకరాల అటవీ భూమి సాగుచేస్తున్నట్లు దరఖాస్తుదారుల్లో స్పష్టమైంది. ఉమ్మడి జిల్లాలో 33,885 మంది గిరిజన రైతులు 1,24,522 ఎకరాలు, 32,119 మంది ఇతర రైతులు 1,02,507 ఎకరాలకు గానూ హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 11,172 మంది గిరిజనులు 44,120 ఎకరాలకు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది గిరిజన రైతులు 51,859 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 5076 మంది రైతులు 14,955 ఎకరాలకు, మంచిర్యాల జిల్లాలో 4,460 మంది రైతులు 13,587 ఎకరాల కోసం అర్జీలు అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 7,172 మంది ఇతర రైతులు 28,472 ఎకరాలకు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,503 మంది రైతులు 44,267 ఎకరాల కోసం, నిర్మల్ జిల్లాలో 3590 మంది 10,037 ఎకరాలకు, మంచిర్యాల జిల్లాలో 7,314 మంది రైతులు 19,830 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన, ఇతర రైతుల దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు.. సర్వేలో భాగంగా అటవీ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శి, అటవీహక్కుల కమిటీ సభ్యులు, స్థానిక రైతులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎంత భూమిని సాగు చేస్తున్నారు? విస్తీర్ణం, నాలుగు దిక్కుల ఏ రైతులు ఉన్నారనే విషయాలను తెలుసుకుని వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
పాలిగన్ టెక్నాలజీతో పట్టాలు..
పోడు భూములకు పట్టాల పంపిణీ తర్వాత అటవీభూములు ఆక్రమణకు గురికాకుండా పాలిగన్ సాంకేతిత పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. భూమి సర్వేనంబర్, విస్తీర్ణం, భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? హద్దులు, ఇతర అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతో పాటు హోలోగ్రామ్ను పోడు పట్టాల్లో పొందుపరుస్తారు. ఈ విధానంతో రైతుల మధ్య వివాదాలు రాకుండా చూడవచ్చు. దీంతో పాటు పక్కన ఉన్న అటవీభూములు ఆక్రమణకు గురికాకుండా నివారించవచ్చు.