ఎదులాపురం, సెప్టెంబర్ 27 : అధికారంలోకి వచ్చేందుకు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కుక్కర్లు పంచుతున్న పార్టీ కావాల్నా? పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలిదాకా సంక్షేమ పథకాలు అందిస్తున్న సర్కారు కావాల్నా? ప్రజలు గమనించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడి ప్రజలకు రూ.2,016 పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేవలం ఎన్నికలున్నాయని తెలంగాణలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలోని మినీ తానీషా గార్డెన్లో బుధవారం దస్నాపూర్కు చెందిన సామాజిక కార్యకర్త నీరటి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే జోగు రామన్న పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అమెరికాలో అక్రమ సంపాదనతో ఇక్కడికి వచ్చి రూ.400తో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారన్నారు. వాటితో కడుపు నింపదని, సీఎం కేసీఆర్ ఇచ్చే అమ్మఒడి, కేసీఆర్ కిట్ తల్లీబిడ్డకు భరోసా ఇస్తుందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అమలుఅవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ వర్తింపజేస్తానని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో అన్నారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సరైన సంక్షేమ పథకాలు అమలు కాక, తెలంగాణ రాష్ట్రంలో అసలుకే అమలు సాధ్యంకాని పథకాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రూ.400తో ఇచ్చే కుక్కర్ల పార్టీ కావాలా? నవజాత శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ఇచ్చే సంక్షేమం కావాల్నా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఓట్ల కోసమే కుక్కర్ల పంపిణీ కార్యక్రమమని, ఎన్నికల తర్వాత ఇక్కడ నుంచి అమెరికా, ఢిల్లీకి పారిపోయే వారు చాలా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యూనీస్ అక్బానీ, వార్డు కౌన్సిలర్ భరత్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, మహిళా విభాగం పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు స్వరూపారాణి, మమత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, మైనార్టీ పట్టణాధ్యక్షుడు సలీంపాషా, నాయకులు దివిటి రాజు, స్వామి తదితరులున్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పరిశీలన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 27 : పట్టణంలో చేపడుతున్న ఓవర్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.