ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడ్రోజులు వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తొలిరోజైన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సంబురాలు పండుగలా కొనసాగాయి. ఊరూవాడా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు అన్నదానం, పండ్ల పంపిణీ నిర్వహించారు. ఆదిలాబాద్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్రెడ్డి, రేఖానాయక్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్లు కోవలక్ష్మి, రాథోడ్ జనార్దన్ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా.. ఆదివాసీ గూడేల్లో కూడా వేడుకలను సంబురంగా జరుపుకున్నారు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మూడ్రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగాయి. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి.. దవాఖాన ఆవరణలో అన్నదానం చేశారు. నార్నూర్లో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నదానం చేశారు. సీఎం కేసీఆర్ ఆయరారోగ్యాలతో ఉండాలని నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మ మహాదేవి ఆలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పండ్లు పంపిణీ చేశారు. హాజీపూర్ మండలంలోని దొనబండ, లక్షెట్టిపేట మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖాన, పాతబస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలేబోరిగాం ఆదివాసీ గూడేంలో అన్నదానం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తదాన కార్యక్రమానికి జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.