‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఏర్పాటు చేసి.. ప్రతి మంగళవారం చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 3,101 మందికి ట్రీట్మెంట్ చేశారు. ఇందులో 1,488 మందికి రక్తహీనత, 14 మందికి థైరాయిడ్, ఆరుగురికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేల్చారు. 2,910 మంది రక్త నమూనాలను టీ-హబ్కు పంపించారు. ఇందులో 253 మంది తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేలడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు. ఆరోగ్య మహిళకు మంచి స్పందన లభిస్తుండడంతో మరో రెండు పీహెచ్సీల్లో ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం లక్ష్మణచాంద, కుంటాల మండలాల్లోని పీహెచ్సీలను ఎంపిక చేసింది. వీటిలో కూడా త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.
నిర్మల్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల కోసం కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీ టీమ్స్, సఖీ కేంద్రాల వంటివి కొనసాగిస్తోంది. ఈ యేడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆరోగ్య మహిళ’ పేరిట కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను ఎంపి క చేసి, ప్రత్యేకంగా మహిళలకు వైద్య పరీక్షలు అందిస్తున్నది. ఇందులో అన్ని వయసులవారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నారు. వైద్యసేవల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేక క్లినిక్లను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలను నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అనంతరం మందులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండడంతో జిల్లాలో మరో రెండు పీహెచ్సీల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష్మణచాంద, కుంటాల పీహెచ్సీల్లో ఇకపై ప్రతి మంగళవారం ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్లను నిర్వహించనున్నారు. కొత్త వాటితో కలిపి మొత్తం నాలుగు పీహెచ్సీల్లో అందుబాటులోకి రానున్నాయి. 35 ఏండ్లు నిండిన ప్రతి మహిళ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లావ్యాప్తంగా మరిన్ని పీహెచ్సీల్లో మహిళా క్లినిక్లను విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు మెడికల్ ఆఫీసర్లుగా ఉన్న పీహెచ్సీలకు ముందుగా ప్రాధాన్యతనిస్తున్నారు.
ఎనిమిది విభాగాల్లో పరీక్షలు
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఎనిమిది విభాగాల్లో మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రాథమిక డయాగ్నోస్టిక్, సూక్ష్మ పోషకలోపాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఐడీ, పీసీవోఎస్, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మోనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు తదితర అంశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్రానికి వచ్చే మహిళల వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. క్యాన్సర్, గర్భాశయ సమస్యలు నిర్ధారణ అయిన వారిని దవాఖానలకు పంపించి చికిత్స అందేలా చూస్తున్నారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో సిబ్బంది మొత్తం మహిళలే కావడంతో ఇక్కడికి వచ్చే మహిళలు తమ సమస్యలను నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహిళలు దవాఖానకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అందరూ మహిళా వైద్యులను నియమించి చికిత్స అందిస్తున్నది.
విశేష స్పందన
ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. జిల్లాలోని నిర్మల్, భైంసా అర్బన్ హెల్త్ సెంటర్లలో గత మార్చి 8న శ్రీకారం చుట్టగా, 25 వారాలపాటు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,101 మంది మహిళలకు పరీక్షలు చేశారు. ఇందులో 1,488 మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే 14 మంది థైరాయిడ్, ఆరుగురు మహిళలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కాగా.. ఇప్పటి వరకు పరీక్షలు చేయించుకున్న 3,101 మందిలో 2,910 మంది మహిళల రక్త నమూనాలను టీ-హబ్కు పంపి పరీక్షలు చేశారు. ఇక్కడి పరీక్షల్లో 253 మంది మహిళలు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. వీరిలో అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేశారు.
త్వరలోనే మరో రెండు పీహెచ్సీల్లో ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా రెండు మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ శిబిరాల్లో మహిళా సిబ్బంది, మహిళా డాక్టర్లు విధుల్లో ఉంటారు. భైంసా, నిర్మల్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ మహిళా క్లినిక్లను నిర్వహిస్తున్నాం. త్వరలోనే లక్ష్మణచాంద, కుంటాల పీహెచ్సీల్లో ఈ కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇందుకు సంబంధించి ఆయా పీహెచ్సీల్లో పని చేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లకు రెండు రోజులపాటు హైదరాబాద్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్లను ప్రారంభిస్తాం. – డాక్టర్ ధన్రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిర్మల్.