కౌటాల, ఏప్రిల్ 11 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి, కనికి, మొగఢ్దగఢ్, గుడ్లబోరి గ్రామాల్లో 350 ఎకరాల్లో మిరప సాగువుతున్నది. ఇక్కడ పండిన పంటను మహారాష్ట్రకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఈ యేడాది ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తున్నది. క్వింటాలుకు రూ.20 వేల పైనే ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాటిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 70 మంది రైతులు తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతాల నుంచి మేలు రకం విత్తనాలు తెప్పించడంతో మంచి దిగుబడి వస్తున్నది.
నాగ్పూర్ మార్కెట్కు తరలింపు..
మన వద్ద పండించిన మిరపకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండడంతో నాగ్పూర్లో అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలుకుతోంది. కౌటాల నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే వరంగల్ మార్కెట్ కూడా 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే నాగ్పూర్ మార్కెట్లో ధర ఎక్కువ ఉండడంతో అక్కడికే పంటను తరలిస్తున్నారు.
ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి
ఎకరంలో మిరప సాగు చేస్తే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల పెట్టుబడి అవుతుంది. ఎకరంలో 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. క్వింటాలుకు రూ.20 వేల చొప్పున లెక్క వేసుకున్నా.. 30 క్వింటాళ్లకు రూ.6 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నది. పెట్టుబడి ఖర్చులు పోనూ రూ.4.70 లక్షల ఆదాయం వస్తుందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 24 గంటల కరెంట్ వరంగా మారింది. ఉచిత కరెంట్తో రైతులు రంది లేకుండా సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
రెండేళ్లుగా మిరప వేస్తున్న..
రెండేళ్లుగా మిరప సాగు చేస్తున్న. ఈ ఏడాది మూడెకరాల్లో వేసిన. పోయినేడు దిగుబడి అంతగా రాలేదు. మిరప ధర కూడా తక్కువగా ఉండే. ఈసారి 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మహారాష్ట్రలో క్వింటాలుకు రూ.20 వేలకు పైన ధర ఉందని అమ్మిన. మంచి లాభమచ్చింది. ఇంకా తోటలో మిరపకాయలున్నయ్. ఆయింత కూడా తెంపి అమ్ముకుంట.
– గోండి జీవన్కళ, రైతు, తాటిపల్లి.
సంతోషంగా ఉంది..
తెలంగాణ రాకముందు నీళ్లుంటే.. కరెంట్ ఉండేది కాదు.. కరెంటు ఉంటే నీళ్లుండేవి కావు. మస్తు తిప్పలయ్యేటిది. మన రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతులకు రంది లేకుంటైంది. పుష్కలంగా నీళ్లుంటున్నయ్. ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల దర్జాగా పంటలు వేసుకుంటున్నం. మా ఊరి శివారులోని 3 ఎకరా ల్లో మిరప వేసిన. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుంచి విత్తనాలు తీసుకొచ్చి నాటిన. ఇప్పటికే 70 క్వింటాళ్ల మిరపకాయలు ఏరి అమ్మిన. మంచి ధర వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– బోయర్ విలాస్, రైతు, తాటిపల్లి
150 క్వింటాళ్లు అమ్మిన..
నాలుగేండ్లుగా మిరప సాగు చేస్తున్న. కొత్తలో దిగు బడి అంతగా రాలేదు. అప్పుడు ధర కూడా తక్కువగా ఉండే. మొదట్లో అప్పులు మీద పడ్డయ్. ఈ యేడాది ఏడెకరాల్లో సాగు చేసిన. ఇప్పటి వరకు 150 క్వింటాళ్ల పంట తీసి నాగ్పూర్ లో అమ్మిన. మరో 70 క్వింటాళ్లకు పైగానే కోతకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నష్టపోయినప్పటికీ ఇందులో కలిసి వస్తున్నది. ఇందుకు సంతోషంగా ఉంది.
– రోహిణే భాస్కర్, రైతు, తాటపల్లి.
మహారాష్ట్రలో మంచి ధర..
నాకున్న ఆరెకరాల్లో మిరప వేసిన. ఇప్పటికే 130 క్వింటాళ్ల పంట అమ్మిన. ఇంకా తీయాల్సి ఉంది. మహారా్రష్ట్రలో మిరపకు మంచి ధర ఉంది. అక్క డ ఎలాంటి రకం మిరప కాయలున్నా అమ్ముడు పోతాయి. ధర కూడా మంచిగుంటుంది. నాగపూర్ 270 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాన్స్పోర్టుకు క్వింటాలుకు రూ.500 తీసుకుంటున్నరు. స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– బడిగే సంతోష్, రైతు, తాటిపల్లి.