హాజీపూర్, ఫిబ్రవరి 22 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ పథకం కింద అర్హులైన శ్రామిక కుటుంబాలకు పని కల్పిస్తూ అర్హులందరికీ జాబ్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు.
మంజూరైన పనులకు అనుమతులు పొందిన తర్వాత కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పురోగతి వివరాలు, ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులపై సోషల్ ఆడిట్ బృందం వారు తనిఖీ చేసిన అంశాలను ఆధారాలతో ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎన్పీఏలను రెండు శాతం కంటే తక్కువ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, స్త్రీ నిధిలో అర్హులైన సభ్యులకు సాధారణ రుణాల ద్వారా రూ. 40 వేల వరకు రుణం అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని లక్ష్యాల సాధన దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్పీఏపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్త్రీ నిధి పథకం కింద మహిళలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్, అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో..
ఆసిఫాబాద్, ఫిబ్రవరి22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ హేమంత్ బొరడే మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనులు వేగవంతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.