తెలంగాణ ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. సీఎం హోదాలో జిల్లాకు మూడోసారి వస్తుండడంతో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను ప్రారంభించనుండగా.. కొట్నాక్ భీం రావ్, కుమ్రం భీం విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనుండగా.. మొదటగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 12 మందికి పట్టాలు అందించనున్నారు. సీఎం రాక సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలో దారి పొడవునా కేసీఆర్ ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. సభా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దగా.. సీఎం ప్రసంగాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. వర్షం వస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రాంగణమంతా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేశారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగగా.. 2,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
– మంచిర్యాల, జూన్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రగతి రథ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోటుపాట్లు లే కుండా ఉండేందుకు గడిచిన కొద్ది రోజులుగా ఆర్ అండ్ బీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ ఏర్పాట్లపైనే దృష్టిసారించారు. హైదరాబాద్ నుంచి నేడు మధ్యాహ్నం సీ ఎం కేసీఆర్ ఆసిఫాబాద్ చేరుకోనున్నారు. ముం దుగా కలెక్టరేట్కు దగ్గరిలోని పిల్లల పార్క్లో కొట్నాక్ భీం రావ్, కుమ్రం భీం విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రా రంభించి జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీ లో కూర్చోబెడతారు. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ని ప్రారంభిస్తారు. అక్కడే రాష్ట్రవ్యాప్తంగా పోడుపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సీఎం చేతుల మీదుగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 12 మందికి ఈ పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల లిస్ట్ను సైతం అధికారులు ఫైనలైజ్ చేశారు. పట్టాల పంపిణీ అయిపోగానే ఆసిఫాబాద్ పట్టణంలో ని ర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకొని సాయంత్రం 5 గంటలలోపు ఈ కా ర్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్లనున్నారు.
సర్వాంగ సుందరంగా కార్యాలయాలు…
సీఎం కేసీఆర్ ప్రారంభించే నూతన కలెక్టరేట్ భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు కలెక్టర్ ఛాంబర్, మీటింగ్ హాల్స్, సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించే హాల్స్ అన్నింటినీ ప్రత్యేక పూలతో అలంకరించారు. గురువారం ఉదయం నుంచే సుందరీకరణ పనులు చేపట్టారు. రెండు లారీల్లో పూలను తెప్పించి పనులు చేస్తున్నారు. అన్ని శాఖల ముఖ్య అధికారుల పర్యవేక్షణలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ప్రాంగణ మంతా కలియదిరిగి పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టర్ను ఆయన చాంబర్లో స్వయంగా కూర్చోబెట్టి తొలి ఫైల్పై సంతకం చేయించనున్నారు. సీఎం రావడానికి ముందే కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. సీఎం ప్రారంభించే ఎస్పీ కార్యాలయంతో పాటు పార్టీ కార్యాలయాలను అలంకరిస్తున్నారు. గురువారం రాత్రికి ఈ పనులన్నీ పూర్తి కానున్నాయి. అలాగే సీఎం పర్యటన కోసం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశా రు. కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ప్రధాన కూడళ్లతో పాటు, కలెక్టరేట్కు వెళ్లే దా రులు, బహిరంగ సభ నిర్వహించే రోడ్డు పొడవు నా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారు.
భారీ జన సమీకరణ..
సీఎం కేసీఆర్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సీఎం బహిరంగ సభకు దాదాపు 50 వేల మందిని సమీకరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవార్గల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఒక్కో నియోజకవర్గం నుంచి 25వేల మందికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు వందల ఆర్టీసీ బస్సులు, 900 ప్రైవేటు వాహనాల్లో జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 8 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. భూమికి ఎనిమిది ఫీట్ల ఎత్తులో పెద్ద సభా వేదిక పనులు చేస్తున్నారు. వచ్చే ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగం చూసేలా వేదిక వెనుక ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ పనులతో పాటు సభా ప్రాంగణాన్ని చదును చేయడం, భారీ కేడ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. వర్షం వస్తే ఇబ్బందులు పడకుండా ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూప్ టెంట్లు వేయిస్తున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు..
సీఎం కేసీఆర్ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. కొత్త కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు, పార్టీ కార్యాలయం సహా బహిరంగ సభా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్ స్కాడ్లు తనిఖీలు మొ దలుపెట్టాయి. పర్యటనకు 24 గంటల ముందు చేసే అతి కీలకమైన టెస్ట్ కూడా పూర్తయ్యింది. సీ ఎం బందోబస్తు కోసం రెండువేల ఐదు వందల మంది పోలీసులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. నలుగురు ఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీ లు, 10 మంది డీఎస్పీలు, 49 మంది సీఐలు, 12 మంది ఉమెన్ ఎస్సైలు, 159 మంది ఎస్సైలు, 26 4 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 840 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 109 మంది ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్, 166 హోంగార్డ్స్, 77 స్పె షల్ పార్టీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు.