మంచిర్యాల, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా ఒకటేమిటి అన్నింటీ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర సర్కారు, ఇప్పుడు మందు బిల్లలనూ సైతం వదల్లేదు. జ్వరం, బీపీ, డయాబెటిస్, రక్తహీనత, గుండె జబ్బులకు సంబంధించిన 384 అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్ల రేట్లను ఏకంగా 12 శాతానికి పెంచింది. నేటి నుంచి అమల్లోకి రానుండగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై మోయలేని భారం పడనున్నది. అత్యాధునిక సౌకర్యాలతో దవాఖానలు నిర్మించి ఉచితంగా వైద్యమందించడం కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనమైతే.. వ్యాపారం కోసం రోగులనూ వదలని నైజం కేంద్రానిది అంటూ ప్రజానీకం మండిపడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపి నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తుండగా, కేంద్ర సర్కారు మాత్రం ధరల మీద ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే ఇదీ.. అదీ.. అని లేకుండా.. అన్ని రకాల వస్తువుల ధరలు పెంచగా, తాజాగా.. రోగులకు అత్యవసరమైన మందుల రేట్లనూ పెంచుతున్నది. అత్యాధునిక సౌకర్యాలతో దవాఖానలతో పాటు జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాల నిర్మించడంతో పాటు బస్తీ దవాఖానలు సైతం అందుబాటులో తేవడం సీఎం కేసీఆర్ గొప్పతనమైతే.. రోగం వస్తే వేసుకునే మందు బిల్లలను సైతం వదలని క్రూరత్వం మోదీది అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
గత ప్రభుత్వాల్లో తక్కువ..మోదీ వచ్చాకే ఎక్కువ..
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర మందుల ధరలు 2 శాతం నుంచి 3 శాతం మాత్రమే పెరిగేవి. చాలా అరుదుగా మాత్రమే 4 శాతం పెంపు ఉండేది. కానీ మోదీ ప్రధాని అయ్యాక.. ఔషధ ధరల పెంపు అధికమైంది. 2022లో అధికాస్తా 11 శాతం దాటింది. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 12 శాతం ధరలు పెంచిన కేంద్ర సర్కారు.. కష్టాల్లో ఉన్న పేద రోగులు, సాధారణ ప్రజల నడ్డీ విరుస్తున్నది. మోదీ రాక ముందు రూ.10 ఉన్న మందు బిల్ల ఇప్పుడు రూ.20 అయ్యిందంటూ రోగులు మండిపడుతున్నారు. జ్వరం మందులు(పారాసిటమాల్), యాంటి బయోటిక్స్(ఆజిత్రోమైసిన్ వంటివి), పోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్ వంటి యాంటీ ఎనీమియా ప్రిస్క్రిప్షన్ మందులు, అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, డయాబెటిస్, రక్తహీనత, రక్త ప్రసరణ సంబంధిత జబ్బులు, క్షయ(టీబీ), వివిధ రకాల క్యాన్సర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తంగా 384 మందుల ధరలు పెరగనున్నాయి. ప్రైవేటులో చికిత్స చేయించుకునే వారికి ఔషధ ధరల పెంపు మరింత భారంగా మారనున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉచిత మందుల పంపిణీ, ఉచిత వైద్య సేవలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం..
ధరల పెంపుతో పడే భారం..
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఔషధ ధరలతో బీపీ, షుగర్లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై ప్రతి నెలా అదనపు భారం పడనున్నది. ప్రస్తుతం షుగర్ ట్యాబ్లెట్ 12 గోలీలు ఉండే ఒక షీట్ ధర రూ.102 ఉంది. 12 శాతం పెరిగితే.. ధర రూ.115 దాటుతుంది. అంటే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకునే వారిపై రూ.40, రోజుకు రెండు పూటలా ట్యాబ్లెట్స్ వేసుకునే వారిపై రూ.80 వరకు అదనపు భారం పడనున్నది. బీపీ ట్యాబ్లెట్లు వాడే వారిపైనా ఇదే తరహా దోపిడీ ఉండనున్నది. కాగా, 2014లో షుగర్ ట్యాబ్లెట్ షీటు ధర రూ.60 నుంచి రూ.65 మధ్యలో ఉండేది. ఇప్పుడది రూ.115కు పెరగనుంది అంటే దాదాపు డబుల్ అయినట్లే.. ఒకప్పుడు బీపీ, షుగర్ వచ్చిన వ్యక్తి నెలకు సరిపడా మందులు కొటే రూ.300 అయ్యేది ఇప్పుడు రూ.600 దాటిపోతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో లేవీ బాధలు..
తొమ్మిదేళ్లలో మందుల ధరలు పెంచుడు మోదీ వంతైతే.. ధర ఎంత పెరిగినా సరే తెలంగాణ ప్రజలకు ఆ ఔషధాలను ఉచితంగా ఇస్తున్న గొప్ప మనసు కేసీఆర్ది. ఇప్పటికే నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్తో బాధపడుతున్న ఒక్కో రోగికి ప్రతి నెలా రూ.600 నుంచి రూ.1500 విలువైన మందులు ఉచితంగా అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్సీడీ మందుల కిట్ బ్యాగ్లో బీపీ, షుగర్ నియంత్రణలో ఉన్న వారికి, లేని వారికి నెలకు సరిపడా బీపీ, ఎఫ్బీఎస్, పీపీబీఎస్ మందులు అందజేస్తున్నారు. అంటే 2014లో రూ.300 ఉన్న మందులను ఉచితంగా ఇస్తే ఇప్పుడు రూ.600 దాటిన మందులను సైతం ఉచితంగానే ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 71,858 మంది షుగర్, 1,73,330 మంది బీపీ వ్యాధి గ్రస్తులు లబ్ధిపొందుతున్నారు. దీంతో కేసీఆర్ సర్కారుకు రుణ పడి ఉంటామని వారంతా చెబుతున్నారు.
ఇదీ బీపీ, షుగర్ పేషెంట్ల కోసం తెలంగాణ సర్కారు అందిస్తున్న ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్) మందుల కిట్. రక్తపోటు-చక్కెర వ్యాధి నియంత్రణలో ఉన్నవారికి, నియంత్రణలో లేని వారికి ప్రభుత్వం నెలకు సరిపడా మందులు (రెండు రకాలు) ఈ బ్యాగ్లో పెట్టి ఇస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మొదలైన కిట్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా సాగుతున్నది. ముసలి తనంలో ఎవరి మీద ఆధారపడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భరోసానిస్తున్నారు.
జ్వరం, బీపీ, డయాబెటిస్, రక్తహీనత, గుండె జబ్బులకు సంబంధించిన 384 నిత్యావసర ఔషధాలు, మెడికల్ డివైజ్ల ధరలను కేంద్ర ప్రభుత్వం 12 శాతం పెంచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి(ఎన్పీపీఏ) పేర్కొంది. గతేడాది మందుల ధరలు వార్షికంగా 11 శాతం పెంచగా, వరుసగా రెండో ఏడాది 12 శాతం పెంచింది. అంటే ప్రస్తుతం ట్యాబ్లెట్లకు రూ.100 ఉంటే.. ఇకపై రూ.112కు చెల్లించాల్సి వస్తుంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులపై ప్రతి నెలా రూ.60 నుంచి రూ.100 వరకు అదనపు భారం పడుతున్నది.
ధరలు పెంచడం అన్యాయం
ఎదులాపురం, మార్చి 31 : కేంద్రంలోని బీజేపీ సర్కారుతో మాలాంటి గరీబోళ్లకు అచ్చేదిన్ బదులు సచ్చే రోజులచ్చాయి. గిప్పటి దాకా రోజు అవసరమయ్యే వాటి ధరలు పెంచిన్రు. ఇగ మొన్న సిలిండర్ గ్యాస్ ధర సైతం పెంచడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గిప్పుడు బీపీ, షుగర్తో పాటు ఇతర మందులపై ధరలు పెంచారు. సీఎం కేసీఆర్ పెద్ద అన్నలా ఉచితంగా మందులు ఇస్తుంటే.. బీజేపీ సర్కారు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నది. మాలాంగోళ్ల పాణాలు కాపాడే గోలీల ధరలు 12 శాతం పెంచడం సరికాదు. ప్రతినెలా ఇంటికచ్చే బీపీ, షుగర్ గోలీలు ఉట్టిగనే ఇచ్చి పోతున్రు.
– పద్మ, ఫిల్టర్బెడ్, ఆదిలాబాద్ పట్టణం
సామాన్యులపై పెనుభారం
నిర్మల్ చైన్గేట్, మార్చి 31 : నేను నిర్మల్లో కూలీ పనిచేసుకుంట. నాకు బీపీ ఉన్నది. ఇరవై ఏళ్లుగా మందులు వాడుతున్నా. నెలకు రూ.100 పైగా గోలీలకే ఖర్చయితున్నయ్. నేను పనిచేస్తే అచ్చే పైసలు తక్కువనే. రోజు ఇంట్లోకి వాడే వస్తువుల ధరల్లాగే మందుల రేట్లు పెంచితే ఎలా బతికేది. ఏమైనా అనుకోని రోగమొస్తే మందులకే పెద్దమొత్తంలో ఖర్చవుతాయి. ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే మందుల ధరలు తగ్గించాలి.
– సుంకరి రమేశ్, నిర్మల్
మందుల కిట్ మంచిగుంది
కోటపల్లి, మార్చి 31 : నాకు కొన్నేండ్ల సంది షుగర్ ఉన్నది. ఇది వరకు పైసలు పెట్టి మందులు కొనుక్కునే దాన్ని. ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్లు బీపీ, షుగర్ పేషెంట్లకు పైసా తీసుకోకుండా మందుల (ఎన్సీడీ) కిట్లు ఇస్తున్నరు. మా ఊరి ఆశ కార్యకర్త ఇంటికి వచ్చి ఇచ్చిపోతంది. ఈ కిట్లో మూడు అరలున్నయ్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి.. ఇట్లా మూడు అరల్లో మూడు రకాల గోలీలు పెట్టుకోవచ్చు. ఏ సమయానికి వేసుకునే గోలి.. ఆ సమయానికి వేసుకోవచ్చు. అంతకు ముందు ఎప్పుడు ఏ గోలి వేసుకోవాల్నో తెలిసేది కాదు. ఇప్పుడు ఇగ ఆ ఇబ్బంది లేదు. సీఎం కేసీఆర్ సార్ మాలాంటి పేదోళ్లను కడుపున పెట్టుకుంటుంటే.. కేంద్ర సర్కారోళ్లు మాత్రం అన్ని ధరలు పెంచి ఆగం చేస్తున్నరు. గిసొంటి ప్రధాన మంత్రిని ఇది వరకు సూడలే.. – ఈర్ల శంకరమ్మ, ఎడగట్ట