తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జోగు రామన్న, బాపురావ్, రేఖానాయక్, విఠల్రెడ్డి, జడ్పీ చైర్మన్లు కోవలక్ష్మి, భాగ్యలక్ష్మి, జనార్దన్ రాథోడ్ కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు ఎదుర్కొన్న కరెంట్ కష్టాలు, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సాధించిన ప్రగతిపై వివరించారు. ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు.
– నమస్తే బృందం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను వైభవంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట సభలు నిర్వహించారు. చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో విప్ బాల్క సుమన్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో ఘనమైన ప్రగతి సాధించామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశంమొత్త ‘తెలంగాణ మోడల్’ వైపు చూస్తున్నదని చెప్పుకొచ్చారు. లక్షెట్టిపేటలోని ఎస్పీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి పాల్గొన్నారు. కళాకారులు ఆటా పాటలతో హోరెత్తించారు. బెల్లంపల్లిలోని కన్నాల ఆర్పీ గార్డెన్స్లో ఎమ్మెల్యే చిన్నయ్య, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జగదాంబ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సంబురాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, కలెక్టర్ బోర్కడే హేమంత్ పాల్గొన్నారు. కెరమెరిలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సాధించిన ప్రగతిపై వివరించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొన్నారు. విద్యుత్ వినియోగం, అభివృద్ధిపై కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. బోథ్ మండలం పొచ్చెర క్రాస్రోడ్డులోని సాయి కాన్ఫరెన్స్ హాల్లో బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ పాల్గొని.. మొదట తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఖానాపూర్లోని జేకే పంక్షన్ హాల్లో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్, భైంసాలోని ఎన్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి, జిల్లా పర్యవేక్షక ఇంజినీరు జయంత్రావుచౌహాన్ పాల్గొన్నారు. డాక్యుమెంటరీ, వీడియోగ్రఫీతో తీసిన విజయగాథలను విద్యుత్ వినియోగదారులకు చూపించారు.
– నమస్తే బృందం